ఖమ్మం, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో క్యాంపుల రాజకీయం షురూ అయింది. సోమవారం ఖమ్మం నగరం నుంచి పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులు క్యాంపునకు బయల్దేరి వెళ్లారు. వివిధ మండలాల నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ కు చేరుకున్నారు. అక్కడ ఓటర్లతో పార్టీ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నేత గాయత్రి రవితో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు సమావేశమయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ కు బస్సుల్లో తరలించారు. అక్కడి నుంచి ఓటర్లను గోవాకు తీసుకెళ్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు గోవాలో క్యాంపు వేసేందుకు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు.
చలో క్యాంపులకు..
ఆదిలాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆదిలాబాద్కు చెందిన ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించారు. హైదరాబాద్కు వెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నది డిసైడ్ చేస్తారని తెలిసింది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు ఆఫీసు నుంచి స్పెషల్ బస్సుల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బయలుదేరారు.