మున్సిపాలిటీ ప్రచారంలో ఇండ్ల స్కీమ్ పై మాట్లాడొద్దు.. నాయకులకు TRS ఆదేశం!

మున్సిపాలిటీ ప్రచారంలో ఇండ్ల స్కీమ్ పై మాట్లాడొద్దు.. నాయకులకు TRS ఆదేశం!

మిషన్​ భగీరథపై కూడా గప్​చుప్​

హామీలు అమలుగాకపోవడంతో ఎదురుదెబ్బ తగుల్తుందనే భయం

ఇతర పథకాల గురించే ఓటర్లకు చెప్పాలంటూ గైడ్​లైన్స్

గులాబీ లీడర్లు ఎక్కడికెళ్లినా నీళ్లు, ఇండ్ల కోసం నిలదీస్తున్న జనం

అనేకచోట్ల కేండిడేట్ల విషయంలో క్లారిటీ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార టీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రచారంలో ముందున్నరు. కానీ ఎక్కడా కూడా పేదలకు ఇస్తామన్న డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఇంటింటికీ తాగునీళ్లివ్వాల్సిన మిషన్​ భగీరథ పథకాల ముచ్చట మాత్రం వినిపిస్తలేదు. రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పథకాలు మున్సిపాలిటీల్లో పూర్తిగా అమలుకాలేదు. టౌన్లలో జనం ఇండ్ల కోసం, మంచి నీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు. అధికార పార్టీ లీడర్లు ఎక్కడ కనిపిస్తున్నా వాటిపైనే నిలదీస్తున్నరు. దీంతో ఈ పథకాల ప్రస్తావన తెస్తే.. మొదటికే మోసం వస్తుందని, వాటి ముచ్చటే ఎత్తొద్దని అధికార పార్టీ లీడర్లు, కేడర్​కు హైకమాండ్​ నుంచి ఆదేశాలు వచ్చినయి. అందుకే ఎక్కడా ఆ స్కీమ్​ల ప్రస్తావన తేవడం లేదని టీఆర్ఎస్​ లీడర్​ ఒకరు పేర్కొన్నారు.

టౌన్లలో ఇవే పెద్ద సమస్యలు..

‘ఇండ్లు లేని పేదలందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టిస్తం, ఇంటింటికీ తాగునీళ్లిస్తం.. ఒకవేళ నీళ్లు ఇయ్యకపోతె 2018 ఎలక్షన్లలో ఓట్లే అడుగం’ అని తొలి టెర్మ్​లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఎలక్షన్లు జరిగి రెండో అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా డబుల్​ బెడ్రూం ఇండ్లు రాలేదు, ఇంటింటికీ నల్లా నీళ్లు అందడం లేదు. ఈ ఏడాదిలో పార్లమెంట్​ ఎన్నికలు, పంచాయతీ, పరిషత్​ ఎలక్షన్లు కూడా జరిగాయి. పార్లమెంట్  ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే పంచాయతీ, పరిషత్​ ఎన్నికల్లో సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకుని అధికార పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. తాజాగా మున్సిపల్​ ఎన్నికలు వచ్చాయి. టౌన్లలో అందరికీ మంచి నీళ్లు, పేదలకు ఇండ్లే ప్రధాన సమస్య. సురక్షిత నల్లా నీళ్ల కోసం, డబుల్​ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న జనం.. ఈ పథకాలు అమలుకాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నరు. పంచాయతీలుగా ఉండి ఇటీవలే మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా మారిన చోట్ల తాగునీటి కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయి. అధికారులు వాడల్లో అక్కడక్కడా పెద్ద బోర్లు వేసి పైపులతో ఇండ్లకు నీళ్లిస్తున్నారు. జనం ఆ ఉప్పు నీళ్లనే అవసరాలకు వాడుకుంటూ, వాటర్​ ప్లాంట్ల నుంచి మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు. సర్కారు మిషన్​ భగీరథ నీళ్లు ఎప్పుడిస్తదా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ లీడర్లు ఇండ్లు, భగీరథ పథకాల ఊసే ఎత్తకుండా వేరే అంశాలతో ప్రచారం చేస్తుంటే.. ప్రతిపక్షాల క్యాండిడేట్లు ఇవే అంశాలను లేవనెత్తుతూ జనంలోకి పోతున్నరు.

పైపులైన్ల పనులు సాగుతనే ఉన్నయి

రాష్ట్రంలోని 24 వేలకుపైగా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తాగునీరు అందిస్తామంటూ చేపట్టిన మిషన్​ భగీరథ  ఇంకా సాగుతూనే ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరంగల్‌, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌  కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో ఇంటర్నల్​ పైపులైన్​ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లులు రాకపోవడంతో చాలా మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లు పనులు మధ్యలో వదిలేశారు. అస్తవ్యస్తంగా సాగుతున్న తవ్వకాలు, పనులతో అప్పటికే ఉన్న పాత పైపులైన్లు దెబ్బతిని మంచినీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో పట్టణాల్లో జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు. భగీరథ నీళ్లు అందడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే చెప్తున్నరు. అయితే తప్పును మాత్రం అధికారులపైకి నెడుతున్నరు. తమ నియోజకవర్గాల్లోని ఏ ఒక్క ఇంటికి నీళ్లొచ్చినట్లు నిరూపించినా పదవులకు రాజీనామా చేస్తామనీ అంటున్నారు. నిధులు రాక పనులు జరగకపోతే తమను తప్పుపట్టడం ఏమిటని ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరుకు కొన్నిచోట్ల పూర్తయినా..

సీఎం సొంత జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్​ మున్సిపాలిటీల పరిధిలో తప్ప ఎక్కడా ఆశించిన స్థాయిలో డబుల్​ బెడ్రూం ఇండ్లు పూర్తికాలేదు. సిద్దిపేటలో కిందామీదా పడి 2,500 ఇండ్లను కట్టినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ కేటాయించలేదు. అదే జిల్లాలోని చేర్యాల టౌన్​లో ఇప్పటికీ స్థల సేకరణ కూడా జరగలేదు. పక్కనే ఉన్న మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాల్టీల పరిధిలో మొత్తం 2,050 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినా.. అందులో 600 ఇండ్లు మాత్రమే కట్టారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్క గ్రేటర్​ హైదరాబాద్​ను మినహాయిస్తే.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 1,503 ఇండ్లు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో 80 ఇండ్లనే పేదలకు అందజేశారు. ఇవే తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేషన్ లోనూ, మున్సిపాలిటీలోనూ డబుల్​ ఇండ్లను  ఇవ్వలేదు. పట్టణాల్లో ఇండ్లకు లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. కానీ పూర్తయిన ఇండ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. కొందరికే ఇస్తే మిగతా వారి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని, ఎలక్షన్లలో నష్టం జరుగుతుందని లీడర్లు.. ఆ కొన్నింటి పంపిణీనీ పక్కనపెట్టారు.