
హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ప్రకటించింది. కాగా, కొత్తగూడెం జిల్లాలో ఈనెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తమ ఆత్మహత్యకు వనమా రాఘవ కారణమని రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతోపాటు సెల్ఫీ వీడియో తీసుకుని, అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. దీంతో రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన టీఆర్ఎస్ లీడర్ వనమా రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారయ్యాడు.
ఇప్పటికే రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవపై 302,306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడి కోసం తీవ్రంగా గాలించారు పోలీసులు. తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు వనమాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం: