కొలారస్(మధ్యప్రదేశ్): ఇద్దరు ఫ్రెండ్స్. పని కోసం వందల కిలోమీటర్ల దూరం వచ్చారు. లాక్డౌన్ వల్ల ఉన్న పని పోయి సొంతూరికి బయల్దేరారు. ట్రక్కెక్కారు. అప్పటికే ఒకతనికి జ్వరం. పైగా ట్రక్కులో నిల్సొని ఎండలో పోతున్నరు. ఫీవర్ ఎక్కువైంది. స్పృహ తప్పుతోంది. హాస్పిటల్కు పొయొస్తం ఆగమంటే దింపేసి పోయాడు ట్రక్ డ్రైవర్. రోడ్డుపక్కన వీళ్లిద్దరే. ఫ్రెండ్ మాట్లాడలేకపోతున్నడు. ఏం చేయాలో అర్థమైతలేదు. కాళ్లు చేతులు ఆడట్లేదు. వచ్చిపోయెటోళ్లను హెల్ప్ చేయమన్నడు. కాళ్లావేళ్ల పడ్డడు. కానీ ఎవరు దయ చూపలేదు. ముందుకు రాలేదు. కండ్ల ముందే ఫ్రెండ్ ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నా దిక్కుతోచక అట్లే ఉన్నడు. చివరికి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్కు తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. మధ్యప్రదేశ్లోని కొలారస్లో జరిగిందీ కండ్లు చెమర్చే సంఘటన.
ట్రక్ ఎక్కేటప్పటికే జ్వరం
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాకు చెందిన అమృత్కుమార్ సూరత్లోని ఓ టెక్స్టైల్ యూనిట్లో వర్కర్. తన ఊరి వాడైన మహ్మద్ సాయుబ్తో కలసి ఒకే రూమ్లో ఉంటున్నాడు. మహ్మద్ కూడా ఇంకో టెక్స్టైల్ యూనిట్లో పని చేస్తున్నాడు. అయితే లాక్డౌన్ వల్ల యూనిట్లు బందవడంతో పని పోయింది. దీంతో ఇద్దరూ గురువారం ఊరికి పయనమయ్యారు. ఓ ట్రక్ డ్రైవర్కు రూ. 4 వేలు ఇచ్చి ఎక్కారు. అప్పటికే అమృత్కు జ్వరంగా ఉంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు కానీ జ్వరం తగ్గడం లేదు. టాప్ లేని ట్రక్ లోపల నిలబడి ప్రయాణిస్తుండటంతో ఎండ వేడికి జ్వరం ఇంకింత ఎక్కువైంది.
రోడ్డు పక్కన ఫ్రెండ్తో ఒంటరిగా..
శుక్రవారం మధ్యప్రదేశ్లోని కొలారస్కు ట్రక్ చేరుకునేసరికి అమృత్ శరీరం కాలిపోతోంది. హాస్పిటల్కు వెళ్లొస్తామని ట్రక్ డ్రైవర్కు ఇద్దరు చెప్పగా అందులోని ఇతర వర్కర్లు, ట్రక్ డ్రైవర్ కుదరదన్నారు. దీంతో ఇద్దరూ దిగిపోయారు. అప్పటికే అమృత్ నోట మాట రావడంలేదు. ఓపిక లేక స్నేహితుడి ఒడిలో ఒరిగాడు. దిక్కుతోచని స్థితిలో రోడ్డు వెంబడి వచ్చిపోయే వాళ్లందరినీ మహ్మద్ సాయం అడిగాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
డీహైడ్రేషన్ కావడంతో..
కొంతసేపటికి ఎవరో అంబులెన్స్ ఫోన్ చేయగా అక్కడికి చేరుకుంది. కోలారస్ హాస్పిటల్కు వెళ్లాక డాక్టర్లు చెక్ చేసి అమృత్కు షుగర్ లెవల్స్ తక్కువున్నాయని, టెంపరేచర్ ఎక్కువుందని, గుండెపోటు వచ్చి ఉంటుందని మహ్మద్కు చెప్పాడు. అతన్ని 25 కిలోమీటర్ల దూరంలోని మరో హాస్పిటల్కు రిఫర్ చేశాడు. అక్కడికి చేరుకున్నాక అమృత్ను డాక్టర్లు వెంటనే ఐసీయూలో వెంటిలేటర్పై పెట్టారు. అర్ధరాత్రి తను చనిపోయాడని చెప్పారు. వాళ్లిద్దరూ రెడ్ జోన్ నుంచి వచ్చారు కాబట్టి ఇద్దరి శాంపిళ్లను టెస్టింగ్కు పంపామన్నారు.