స్టాక్హోమ్ : ఒకప్పుడు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్తో పాటు, పలు స్పామ్ కాల్స్ను కనుగొనడానికి ఉపయోగపడే ట్రూకాలర్ యాప్.. ఇప్పుడు అప్పులు కూడా ఇవ్వబోతుంది. వచ్చే ఏడాది నుంచి అప్పులిస్తామని, పూర్తిగా ఫిన్టెక్ కంపెనీగా మారతామని ట్రూకాలర్ వెల్లడించింది. 2020 ప్రారంభంలో తన పేమెంట్స్ ప్లాట్ఫామ్ ద్వారా క్రెడిట్ వ్యాపారాల్లోకి అడుగుపెడతామని ట్రూకాలర్ కోఫౌండర్ నమి జరింగలం చెప్పారు. కంపెనీ హెడ్క్వార్టర్స్లోని పీటీఐకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రూకాలర్ పే ద్వారా క్రెడిట్ ఫెసిలిటీస్ను అందించి ఫిన్టెక్ మార్కెట్లోకి అడుగుపెడతారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. 2020 ప్రారంభంలో ఈ సర్వీసులను అందించడానికి చూస్తున్నామని నమి చెప్పారు.
పరిమిత సంఖ్యలో యూజర్లపై ఈ సర్వీసులను టెస్ట్ చేశామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ మేరకు, ఇండియాలోని యూజర్ల కోసం ‘ట్రూకాలర్ పే’ను అప్డేట్ చేయడంపై వర్క్ చేస్తున్నామని తెలిపారు. తమ కస్టమర్లకు అవసరమైన అన్ని రకాల డిజిటల్ ఎక్స్పీరియెన్స్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నమి చెప్పారు. ట్రూకాలర్ పే ప్లాట్ఫామ్పై 2 కోట్ల మంది యూజర్లుంటారని, వారిలో సగం మంది వరకు టైర్ 2, టైర్ 3 నగరాల వారేనని పేర్కొన్నారు. ట్రూకాలర్ పే భవిష్యత్పై ఆయన ఆశాభావంగా ఉన్నారు. అప్లికేషన్ నుంచి అప్రూవల్ వరకు ప్రతీది ఎండ్ టూ ఎండ్ డిజిటల్ ఎక్స్పీరియెన్స్ను కస్టమర్లకు అందించడానికి ప్రస్తుతం తాము పనిచేస్తున్నామని, భవిష్యత్ చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ఎందుకంటే మైక్రోఫైనాన్స్, క్రెడిట్ వంటి సేవలను ఆఫర్ చేనున్నామని చెప్పారు.
క్యాష్లెస్గా మారడానికి ఇంకా పదేళ్లు…
ట్రూకాలర్ యాప్ తన ప్లాట్ఫామ్పై స్పామ్ కాల్స్ను కనిపెట్టడంతో పాటు, పేమెంట్స్, ఛాట్ వంటి సేవలను అందిస్తోంది. పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లతో దీనికి ప్రమాదాలున్నాయి. పెగాసస్, ఇతర సాఫ్ట్వేర్లు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయని స్వీడన్కు ఇమ్మిగ్రెంట్ నమి చెప్పారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలోనే నివసిస్తుండటంతో, సెక్యురిటీపై అవగాహన కూడా పెరుగుతుందన్నారు. అంతకుముందులాగా పరిస్థితి లేదన్నారు. తమ సిస్టమ్స్పై తనకు విశ్వాసం ఉందని నమి చెప్పారు. యూజర్లు వాడే సాఫ్ట్వేర్, సెక్యురిటీ పాచస్, అప్లికేషన్స్ అప్ టూ డేట్ లేకపోతే, ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్ కల్చర్పై మాట్లాడిన నమి, క్యాష్లెస్గా మారడానికి ఇండియా అవసరమైన ఇన్ఫ్రాస్ట్ర్చర్ అభివృద్ధి చేసుకోవడానికి సుమారు 10 ఏళ్లు పట్టొచ్చని నమి తెలిపారు. కొన్ని సార్లు డిజిటల్ పేమెంట్ల వాడకం తగ్గొచ్చని, కొన్ని సార్లు పెరగొచ్చని ఇది సహజ ప్రక్రియ అని చెప్పారు. ఇండియాలో చాలా పేమెంట్ ప్రొడక్ట్లను ప్రజలు వాడుతున్నారని, కానీ ఇప్పటికీ పర్సులో క్యాష్ లేకుండా బయటికి మాత్రం వెళ్లడం లేదన్నారు. ఈ అడాప్షన్కు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయని నమి చెప్పారు.
