ఫేస్బుక్ ర్యాంకింగ్స్ పై ట్రంప్
తొందర్లోనే ఇద్దరం కలవబోతున్నం
మన దేశంలో టూర్పై మళ్లీ ట్వీట్
ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
వాషింగ్టన్/అహ్మదాబాద్/ముంబై: ప్రముఖ సోషల్ మీడియా ఫేస్బుక్లో తాను, మోడీ నెంబర్ 1, 2 ప్లేసుల్లో నిలవడం గొప్ప గౌరవమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఆహ్వానం మేరకు ఈ నెలాఖరులో ఇండియాలో పర్యటించనున్నానని, ఈ టూర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ నెల 24, 25 తేదీలలో ట్రంప్ దంపతులు మన దేశంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ శనివారం మరోసారి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఫేస్బుక్ ర్యాంకింగ్స్ గురించి ట్రంప్ గతంలోనూ ప్రస్తావించారు. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎన్బీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫేస్ బుక్లో నేను నెంబర్ 1.. మరి నెంబర్ 2 ఎవరో తెలుసా? ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ’ అని చెప్పారు.
ట్రంప్ కాదు.. మోడీనే నెంబర్1
అయితే, ట్విప్లొమసీ 2019 ర్యాంకింగ్స్ ప్రకారం.. ఫేస్బుక్లో 44 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో మోడీ నెంబర్ 1 స్థానంలో ఉండగా.. సుమారు 26 మిలియన్ల ఫాలోవర్లతో ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు. పవర్లేదన్న కారణాన్ని తప్పిస్తే అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఫాలోవర్ల సంఖ్య వీళ్లిద్దరికన్నా ఎక్కువ.. సుమారు 55 మిలయన్ల మంది ఒబామాను ఫాలో అవుతున్నారు. నాన్ పొలిటికల్గా చూస్తే.. ఫుట్బాల్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ(90 మిలియన్ ఫాలోవర్లు), క్రిస్టియానో రొనాల్డో(122.5 మిలియన్లు), పాప్ స్టార్ షకీరా(100 మిలియన్లు)
ట్రంప్ టూర్ కోసం 100 కోట్లకు పైగా ఖర్చు
ట్రంప్ టూర్ కోసం గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ట్రంప్ గుజరాత్లో కేవలం 3 గంటల పాటే ఉంటారని చెబుతున్న అధికారులు.. ఆ 3 గంటల టూర్ కోసం వంద కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. ఇది కేవలం రఫ్గా వేసిన అంచనా మాత్రమే. ట్రంప్ దంపతులకు ఆతిథ్యమిచ్చే విషయంలో బడ్జెట్గురించి ఆలోచించక్కర్లేదంటూ సీఎం విజయ్ రూపానీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ పర్యటించనున్న అహ్మదాబాద్ సిటీ కొత్త అందాలను సంతరించుకుంటోంది. ఎయిర్ పోర్ట్ నుంచి మోతెరా స్టేడియంకు దారితీసే 17 రోడ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. ఒకటిన్నర కిలోమీటర్లున్న ఈ రోడ్లను తీర్చిదిద్దేందుకు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏయూడీఏ) ఏకంగా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ టూర్కు అయ్యే ఖర్చులో కొంత కేంద్రం కూడా భరిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీవీఐపీ రాక నేపథ్యంలో ఏర్పాట్లలో లోపం ఉండకుండా, నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ అనుమతుల కోసం ఆగాల్సిన అవసరంలేకుండా పనులు జరిపించేయాలని సూచించింది. రాష్ట్రంలోని వివిధ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు, కొత్త రోడ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో నుంచే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిధులతో మోతెరా స్టేడియం, సబర్మతి ఆశ్రమం సహా పలు ఇతర రోడ్లను అందంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
యూఎస్ నిర్ణయంవల్ల మనకు నష్టం..శివసేన
ఇండియాను అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చుతూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్ టీఆర్) తీసుకున్న నిర్ణయాన్ని శివసేన తప్పుబట్టింది. పార్టీ పత్రిక సామ్నాలో శనివారం నాటి ఎడిటోరియల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. దీనివల్ల మనదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్ నుంచి తప్పించడం వల్ల వరల్డ్ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) నుంచి అందే ప్రయోజనాలు దక్కవని తెలిపింది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మరో రెండు వారాల్లో మన దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని విమర్శించింది. ట్రంప్ వస్తూ వస్తూ స్వీట్బాక్స్ తెస్తారనుకుంటే.. చేదు మాత్రలు వెంటబెట్టుకుని వస్తున్నాడని ఆరోపించింది. ఈ చేదుమాత్రను మన ప్రధాని తియ్యగా మార్చేస్తారా అని ఛాలెంజ్ చేసింది. ఈ వారం మొదట్లో ఇండియా, చైనాలతో పాటు మొత్తం 24 దేశాలను యూఎస్ టీఆర్ ఈ జాబితా నుంచి తప్పించింది. ఈ 24 దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే అభివృద్ధి చెందాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాషింగ్టన్ అందించే ప్రయోజనాలు ఈ దేశాలకు అవసరంలేదని అంటోంది.
అహ్మదాబాద్ టూర్ కోసం దేనికెంత ఖర్చు?
రూ. 80 కోట్లు: ట్రంప్ వెళ్లే మార్గంలో కొత్తరోడ్లు వేయడానికి, రోడ్లు చదును చేయడానికి
రూ. 12–15 కోట్లు: ప్రెసిడెంట్ సెక్యూరిటీ
రూ. 7–10 కోట్లు: మోతెరా స్టేడియం ఆరంభ కార్యక్రమంలో పాల్గొనే 1000 మంది గెస్టుల ట్రాన్స్పోర్ట్, రిఫ్రెష్మెంట్
రూ. 6 కోట్లు: సిటీని అందంగా తయారుచేయడానికి
రూ. 4 కోట్లు : కల్చరల్ కార్యక్రమాల కోసం