ఇరాన్పై గురువారం రాత్రికి భారీ దాడులు చేస్తామని, ఖర్గ్ ఐల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. ఆ తర్వాత కొన్ని గంటలకే దాడులు ఆపేస్తున్నట్టు చివరి నిమిషంలో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ అగ్రనేతలతో అమెరికా జరిపిన చర్చలు సఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. ‘‘ఇరాన్ నాయకులతో నేరుగా మాట్లాడాం. చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయి.
అందుకే ఈ రాత్రికి ప్లాన్ చేసిన దాడులను నిలిపివేస్తున్నాం’’ అని ప్రకటించారు. తీవ్ర నష్టాన్ని కలిగించే సైనిక చర్యల కంటే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే ఇరు దేశాలకు శ్రేయస్కరమని ఆయన హితవు పలికారు. కానీ.. అంతకు కొన్ని గంటల ముందే ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
‘ఈ రాత్రి (గురువారం) ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేస్తాం.. ఖర్గ్ ఐల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటాం. దాని చమురు మార్కెట్పై వెనెజువెలా తరహా నియంత్రణ సాధిస్తాం’ అని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెడుతూ, వరుసగా మూడో రాత్రి కూడా ఇరాన్పై అమెరికా తన దాడులను కొనసాగిస్తుందని హెచ్చరించారు.
