న్యూఢిల్లీ: గల్వాన్ వ్యాలీ ఘటనతో భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాల మధ్య నమ్మకం ఆవిరైందని సిక్కిం లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి సమయం పడుతుందని చెప్పారు.
‘లడఖ్లో ఘర్షణల తర్వాత ఈశాన్య కమాండ్లో ఇప్పటిదాకా ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరగలేదు. అయితే గల్వాన్ ఘటనతో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారత్-చైనీస్ పీఎల్ఏకు మధ్య పరస్పర నమ్మకం చెదిరింది. మునుపటిలా సంబంధాలు కొనసాగాలంటే కొంత సమయం పడుతుంది’ అని చౌహాన్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియాల్లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని మోడీతోపాటు టాప్ ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు.