హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్ను అరికట్టేందుకు టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) సీరియస్ యాక్షన్కు సిద్ధమైంది. గంజాయి సప్లయర్స్, డ్రగ్స్ పెడ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నది. గంజాయి, డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై నార్కోటిక్స్ డ్రగ్ అండ్ సైకోటోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్టుతో పాటు ‘స్మగ్లింగ్ అం డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానుప్లేటింగ్’ (సఫెమా) చట్టాన్ని టీన్యాబ్ అధికారులు అమలు చేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం జైలుశిక్షలు విధించేలా, సఫెమా యాక్ట్ ప్రకారం దోషుల ఆస్తులను జప్తుచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్కు చెందిన వీరన్న, సైబరాబాద్ నానక్రామ్గూడలోని మరో గంజాయి సప్లయర్ గౌతం సింగ్ ఫ్యామిలీకి సంబంధించి రూ.8 కోట్లు సీజ్ చేశారు. కేసు వివరాలు, ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సెంట్రల్ ఆఫీసుకు పంపించారు. గంజాయి దందాతో ఆస్తులు సంపాదించినట్లు తేలితే ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
కోట్లు కూడబెడుతున్న పెడ్లర్లు
ఈజీ మనీ కోసం డ్రగ్స్, గంజాయి దందా చేస్తున్న సప్లయర్లు, ఏజెంట్లు విశాఖ, ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నారు.హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర, కర్నాటకకు తరలిస్తున్నారు.ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం,ఆదిలాబాద్, కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్లు నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ నెట్ వర్క్ తో స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకూ రవాణా చేస్తున్నారు.ఇలా ఏటా 20 టన్నులకు పైగా సప్లయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో టీ న్యాబ్ ఏర్పడిన తరువాత జూన్, జులైలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 196 కేసులు నమోదయ్యాయి. 399 మందిని అరెస్ట్ చేసి రూ.26 కోట్లు విలువచేసే గంజాయి, డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన వారు బెయిల్పై తిరిగి వచ్చి మళ్లీ దందా ప్రారంభిస్తున్నారు. ఇందుకు కారణం అతి తక్కువ సమయంలో రూ.లక్షల్లో సంపాదించడమే. అలా సంపాదించిన డబ్బుతో పెడ్లర్లు భారీగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికితే తాము సంపాదించిన డబ్బుతో బెయిల్ తీసుకుని మళ్లీ దందా చేయవచ్చని వారి ధీమా. దీంతో మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేసేందుకు టీ న్యాబ్ ప్లాన్ చేసింది. పట్టుబడిన డ్రగ్స్, గంజాయి స్మగ్లర్స్పై అధికారులు సఫెమా యాక్ట్ ప్రయోగిస్తున్నారు. సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న స్థిర, చర ఆస్తులలో కూడిన రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ ఆస్తులను సీజ్ చేసి కోర్టులకు అందిస్తున్నారు.
వీరన్న గ్యాంగ్ ఆస్తులు సీజ్ ఇలా..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన వంకుడోతు వీరన్న ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్తో కలిసి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. తన గ్రామంలో దాదాపు 20 మందిని గంజాయి ట్రాన్స్పోర్టర్లుగా మార్చాడు. 2016 నుంచి డ్రగ్స్ దందాతో వీరన్న రూ.4 కోట్లు సంపాదించాడు. ఆ డబ్బుతో నాలుగు లగ్జరీ కార్లు, బిల్డింగులు కొన్నాడు. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. టీ న్యాబ్ కు అందిన సమాచారంతో ఈనెల 17న వీరన్న, అతడి గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఆస్తులను సీజ్ చేశారు.ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సఫెమా కాంపిటెంట్ అథారిటీకి పంపించారు.‘‘నానక్రామ్గూడ లోధా బస్తీకి చెందిన కలాపతి గౌతమ్ సింగ్ తన కిరణా షాపులో గంజాయి అమ్మాడు.టీన్యాబ్ ఇటీవలే అతడి దుకాణంలో సోదాలు చేయగా డ్రగ్స్, గంజాయి దొరికాయి. గౌతమ్ సింగ్ తో పాటు అతడి గ్యాంగ్ను అరెస్టు చేశారు. రూ.40 లక్షల విలువైన గంజాయి, స్కార్పియో, రెండు బైకులు, 16 బ్యాంకు ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల డాక్యుమెంట్లను చెన్నైలోని సఫెమా కాంపిటెంట్ అథారిటీకి పంపించారు.
విచారణకు చెన్నై వెళ్లాల్సిందే
సఫెమా యాక్ట్ కింద నమోదైన కేసులను చెన్నైలోని ‘సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీ’ విచారణ జరుపుతుంది. ఇందుకోసం కేసు, నిందితులు, పట్టుబడిన సరుకు, సీజ్ చేసిన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను అథారిటీకి పోలీసులు అందిస్తారు. అథారిటీ ఆయా నిందితుల ఆస్తులపై విచారణ జరుపుతుంది. ఇందు కోసం నిందితులకు నోటీసులు జారీ చేస్తుంది. పోలీసులు అందించిన వివరాలతో పాటు నిందితుల వ్యక్తిగత జీవితాలు, వారి ఆస్తులుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబడుతుంది.