- మ్యూల్ అకౌంట్లతో నేపాలీల సైబర్ నేరాలు
- చిలకలూరిపేటకు చెందిన సప్లయర్ను అరెస్ట్ చేసిన సీఎస్బీ
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు, మ్యూల్ అకౌంట్ల హోల్డర్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మ్యూల్ అకౌంట్ల ఏజెంట్లు, ఖాతాదారులు సహా ఇప్పటికే 81 మందిని అరెస్ట్ చేసింది.
ఈ క్రమంలోనే దుబాయ్ కేంద్రంగా నేపాలీలు నడుపుతున్న బ్యాంక్ అకౌంట్ల దందా గుట్టురట్టు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణలో కరెంట్ బ్యాంక్ అకౌంట్లు సేకరించి ఆ డేటాను దుబాయ్కి పంపిస్తున్న కీలక సప్లయర్ను చిలకలూరిపేటలో సీఎస్బీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.
ఈ వివరాలను సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శుక్రవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్ బాషా సుల్తాన్(38) హైదరాబాద్, నోయిడా, ముంబై, నెల్లూరు సహా దేశవ్యాప్తంగా కరెంట్ అకౌంట్లను సేకరిస్తున్నాడు. వీటిని దుబాయ్లో షెల్టర్ తీసుకుంటున్న నేపాలీలు రామేశ్వర్ సహాన్, రాజేశ్ షాలకు సప్లయ్ చేస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇలా సేకరించిన బ్యాంక్ అకౌంట్లను చైనా సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు.
వీటి ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్, గేమింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల నుంచి వచ్చిన డబ్బును లాండరింగ్ చేస్తున్నారు. ప్రతి లావాదేవీకి10 శాతం కమీషన్ ఏపీ సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఉద్యోగి కొల్లిపర వెంకట రామదుర్గా నరేశ్ బాబు(33) నుంచి కరెంట్ అకౌంట్ను షేక్ బాషా సేకరించాడు.
ఇందుకుగాను ప్రతి ట్రాన్సాక్షన్కు10 శాతం చొప్పున కమీషన్ ఇచ్చారు. చైనీస్ చేస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల్లో నిజామాబాద్కు చెందిన బాధితుడు రూ.7.75 లక్షలు కోల్పోయాడు. ఇందులో కొంత డబ్బు నరేశ్ బాబు పేరున ఉన్న కరెంట్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యింది.
ఈ కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. బాధితుడి నుంచి కొట్టేసిన డబ్బు వివిధ అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు గుర్తించింది. గత నెలలో నరేశ్ బాబును అరెస్ట్ చేసి విచారించింది. బుధవారం షేక్ బాషా సుల్తాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. తెలంగాణలో నమోదైన మూడు కేసులతో పాటు దేశవ్యాప్తంగా 26 కేసుల్లో షేక్ బాషా మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లుగా గుర్తించారు.
