- ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి రెండు నెలలైనా పత్తాలేని కౌన్సెలింగ్
- ఇంకా పూర్తికాని కాలేజీల అఫిలియేషన్లు
- కాలేజీల్లో సౌలత్లు లేక సీట్లు తగ్గించిన పీసీఐ
- ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను ఖరారు చేయని టీఎఎఫ్ఆర్సీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఫార్మసీ అడ్మిషన్లపై అయోమయం నెలకొన్నది. టీఎస్ఎంసెట్ ఫలితాలొచ్చి రెండు నెలలు కావొస్తున్నా కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ కాలేదు. ఒకపక్క ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగియలేదు. మరోపక్క ఆయా కాలేజీల్లో ఫీజులనూ టీఏఎఫ్ఆర్సీ ఫైనల్ చేయలేదు. దీంతో బీఫార్మసీ కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే చాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 118 ఫార్మసీ కాలేజీలుండగా, 11 వేల వరకు సీట్లున్నాయి. ఈ ఏడాది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కాలేజీల్లో వసతుల్లేవని సీట్లు తగ్గించింది. పీసీఐ టీమ్స్ తనిఖీల సందర్భంగా కొన్ని కాలేజీల్లో లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ లేరని, ఉన్న వారికి జీతాలు సరిగా ఇవ్వడం లేదని బహిర్గతమైంది. దీంతో చాలా కాలేజీల్లో 2022–23 విద్యాసంవత్సరానికి సీట్లకు కోత పడింది. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిన ఓ ప్రైవేటు కాలేజీలోనూ ఫార్మసీ సీట్లను పీసీఐ తగ్గించింది. జేఎన్టీయూ, ఓయూ, కాకతీయ తదితర వర్సిటీలూ కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేసినా అఫిలియేషన్ ఇవ్వలేదు. ఏకంగా పీసీఐ టీమ్స్ తప్పులు గుర్తించిన నేపథ్యంలో, జేఎన్టీయూ ఉన్న సీట్లలోనూ కోతలు పెడుతుందా లేక పీసీఐ ఇచ్చిన ఇన్టెక్కు పర్మిషన్ ఇస్తుందా అనే దానిపై అయోమయం నెలకొన్నది.
ఫీజులు ఖరారు కాలె...
స్టేట్లోని 113 ప్రైవేటు బీఫార్మసీ కాలేజీల్లో 2022–25 బ్లాక్ పీరియడ్కు ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. గతంలోనే ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లతో హియరింగ్కు టీఏఎఫ్ఆర్సీ డేట్లు ఇచ్చి.. రద్దు చేశారు. ఆ తర్వాత ఇప్పటి దాకా ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ హియరింగ్ చేపట్టలేదు. హియరింగ్ చేసి, ఫీజులను ఖరారు చేసేందుకు మరింత టైమ్ పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
స్టూడెంట్ల ఎదురుచూపులు
ఇంటర్ రిజల్ట్స్ జూన్ నెలాఖరులో రాగా, టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఆగస్టులో వచ్చాయి. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కేటగిరిలో 71,180 మంది క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నడుస్తుండగా, ఫార్మసీ కౌన్సెలింగ్పై అధికారులు సప్పుడు చేయడం లేదు. మేలో పరీక్షలు రాసిన స్టూడెంట్లు, ఫార్మసీలో చేరేందుకు 4నెలలుగా ఎదురుచూస్తున్నారు.