హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓల్డేజ్ హోంల నిర్వహణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షెల్టర్ హోంల నిర్వహణ ఎలా ఉందో ప్రభుత్వ అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్ లేకుండా 41 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయని తెలుసుకున్న హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏకంగా ఇన్ని హోంలు ఉన్నా అధికారుల కంటపడలేదా? అని అడిగింది. ఓల్డేజ్ హోమ్లను ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాల్సిన అధికారులు ఎందుకు చూసీచూడనట్లుగా ఉన్నారో అర్థం కావడం లేదని కామెంట్ చేసింది.
ఓల్డేజ్ హోంలను సరిగ్గా తనిఖీ చేయని అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ లేని ఓల్డేజ్ హోంలపై సర్కారు ఏం చేయనుంది? ఏ చర్యలు తీసుకోనుందన్నదీ తెలియజేయాలని ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్కుమార్ స్పందిస్తూ, రిజిస్ట్రేషన్ లేని హోంలను 15 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటీసులిచ్చినట్లు చెప్పారు. తదుపరి విచారణ జులై 14కి వాయిదా పడింది.

