
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15న జరిగే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,139 సెంటర్లలో నిర్వహిస్తున్న పేపర్1 పరీక్షను 2,69,557 మంది రాయనున్నారు. 913 కేంద్రాల్లో నిర్వహిస్తున్న పేపర్2 ఎగ్జామ్కు 2,08,498 మంది అటెండ్ కానున్నారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, తక్కువగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లను అరెంజ్ చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను శనివారం విద్యా శాఖ అధికారులు www.tstet.cgg.gov.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఐడీ లేదా మొబైల్ నంబర్, డేటాఫ్ బర్త్ వివరాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. టెట్ ఎగ్జామ్ రెండు సెషన్లలో జరగనున్నది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఈ నెల 27న ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.
అభ్యర్థులకు సూచనలు..
- హాల్ టికెట్లో అక్షర దోషాలు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం.. తదితర వివరాలు సరిగా లేకుంటే ఎగ్జామ్ సెంటర్లో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సరిచేసుకోవాలి.
- హాల్ టికెట్పై ఫొటో/ సంతకం సరిగా లేకున్నా, అసలు లేకపోతే అభ్యర్థులు ఇటీవల తీయించుకున్న ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించుకోవాలి. అధార్ లేదా ఇతర ఫొటో ఐడీ కార్డుతో డీఈఓను సంప్రదించాలి.
- అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజేచూసుకోవాలి.
- కాలిక్యులేటర్, మొబైల్ ఫోన్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరు.