
- ఇగం ఇంకెక్కువైంది.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- రాబోయే మూడ్రోజులు మరింత పడిపోనున్న టెంపరేచర్లు
- ఏడు జిల్లాల్లో పది డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇగం ఇంకింత ఎక్కువైంది. రాబోయే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు పడిపోతాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) రిపోర్ట్ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇష్యూ చేసింది. ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ఏడు జిల్లాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎల్లో అలర్ట్ జిల్లాల్లో 10 నుం చి 15 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యే చాన్స్ ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో టెంపరేచర్లు మరింత తగ్గే ప్రమాదం ఉం దని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో 7 నుంచి 8 డిగ్రీల మధ్యే ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కాగా, సోమవారం 23 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదయ్యాయి. మరోవైపు, హైదరాబాద్కు మూ డ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాత్రి టెంపరేచర్లు 12 నుంచి 13 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.4 డిగ్రీలు
ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో బేల మండలంలో 9.4 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 10.5 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.