- మూడు నెలల్లో బస్సులల్ల ‘లైవ్ ట్రాకింగ్ సిస్టమ్’
- వారం క్రితమే టెండర్లు పూర్తి
- త్వరలోనే యాప్, వెబ్సైట్
- మొదటి విడతలో 4,170 బస్సుల్లో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో.. ఎంతసేపట్లో వస్తదో.. ఎన్ని సీట్లున్నయో తెలుసుకునేందుకు ఆర్టీసీ ‘లైవ్ ట్రాకింగ్’ సిస్టమ్ను తీసుకు రానుంది. వారం కిందట టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో అతి త్వరలోనే మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో మూడు నెలల్లో ఈ సేవలు అందు బాటులోకి వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఆర్టీసీకి 9 వేల దాకా బస్సులున్నాయి. మొదటి విడతలో భాగంగా 4,170 బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ను తీసుకురానున్నారు. గరుడ, ఇంద్ర, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ సిటీలో ఏసీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ పెట్టనున్నారు. రెండో విడతలో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఈ సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఎక్కువ దూరం వెళ్లే బస్సులో ఇంటెలిజెన్స్ టిమ్స్ను తీసుకురానున్నారు. దాంతో వెహికల్ ట్రాకింగ్తో పాటు ఎన్ని సీట్లున్నాయో తెలుసుకోవడానికి వీలవుతుంది.
ఎప్పుడో రావాల్సింది..
నిజానికి లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ ఎప్పుడో రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో అది ముందుకు పడలేదు. సిటీలో పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని బస్సుల్లో ఈ సిస్టమ్ను ఏర్పాటు చేసినప్పటికీ కొన్నాళ్లే ఆ సేవలు అందాయి. తాజాగా టెండర్ పూర్తి కావడంతో.. బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి కంట్రోల్ రూంలకు అనుసంధానించనున్నారు. తర్వాత మొబైల్ యాప్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాప్ ద్వారా లొకేషన్లో బస్టాండ్ ఎక్కడుంది? బస్సు స్టార్టింగ్, ఎండింగ్పాయింట్లేంటి? ఎన్ని బస్సులున్నాయి? ఏ టైంకు వస్తాయి? బస్సు ఎక్కడిదాకా వచ్చింది? అన్న వివరాలను తెలుసుకునే వీలుంటుంది. దీని వల్ల గంటల తరబడి బస్టాండ్లలో ఎదురు చూడాల్సిన బాధ తప్పుతుంది.
మహిళలకు మేలు
లైవ్ ట్రాకింగ్ సిస్టంతో యువతులు, మహిళలు, వృద్ధులకు మేలు జరగనుంది. మహిళలు బస్సుల కోసం ఎదురుచూసే సమయంలో ఆకతాయిల వేధింపులు ఎక్కువైతున్నాయి. చైన్ స్నాచర్లు మెడలో గొలుసులు తెంపుకుని పరారైతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ లైవ్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల ఆ ఘటనలకు చెక్పడే చాన్స్ ఉంటుంది. బస్సులో ఇబ్బందులొచ్చినా.. వేధింపులకు గురైనా ఫోన్ ద్వారా యాప్లోనే ఫిర్యాదు చేయవచ్చు. దీంతో జీపీఎస్ ద్వారా ఆ బస్సు లొకేషన్ను ట్రేస్ చేసి పోలీసులు వీలైనంత తొందరగా చేరుకునే వీలుంటుంది. వీటితో పాటు సిటీ బస్టాపుల్లో ఏ బస్సు ఎప్పుడొస్తుందో చెప్పేందుకు వీలుగా ఎల్ఈడీ డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు.
ఆర్టీసీ ఆమ్దానీ పెరుగుతోంది
కరోనాతో కుదేలైన ఆర్టీసీ ఆదాయం నెమ్మదిగా పెరుగుతోంది. రోజువారీ రెవెన్యూ కలెక్షన్ రూ.8 కోట్ల నుంచి రూ.13 కోట్లకు పెరుగుతోంది. సోమవారం రూ.13.85 కోట్ల ఆదాయం రాగా, మంగళవారం రూ.12 కోట్ల ఇన్కం వచ్చింది. ఈనెల 2వ తేదీ నుంచి సగటున ప్రతిరోజూ రూ. 11 కోట్ల వరకు ఇన్కం రాగా.. ఆక్యుపెన్సీ రేషియో కూడా 65% నుంచి 75 శాతానికి పెరిగింది. సోమవారం 77.6%, మంగళవారం 69% ఓఆర్ నమోదైంది. ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్ రూ.40గా రికార్డవుతోంది. మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపడం, రాష్ట్రవ్యాప్తంగా జాతరలు జరుగుతుండటం, పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఉండటంతో సంస్థకు మంచి ఆదాయం వస్తోంది.
గరుడ ప్లస్ చార్జీల తగ్గింపు
ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు చార్జీలను తగ్గిస్తూ సంస్థ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని బస్సు ఫేర్తో ఏసీ గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణించొచ్చని తెలిపారు. తగ్గిన చార్జీలు మార్చి 31 వరకు అమల్లోకి ఉంటాయన్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో పాత చార్జీలే ఉంటాయన్నారు. కర్నాటక ఆర్టీసీతో సమానంగా ఫ్లెక్సీ చార్జీలు అమల్లో ఉన్న హైదరాబాద్– బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు కూడా పాత చార్జీలే ఉంటాయన్నారు.హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్– ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్– భద్రాచలం మధ్య రూ.121, హైదరాబాద్ – వరంగల్ మధ్య రూ.54 చార్జీ తగ్గిస్తున్నట్లు తెలిపారు.