
షాద్ నగర్, వెలుగు: విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ సంఘం నేతలు కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు టీచర్ల సమస్యలపై వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం గాడి తప్పిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో రూమ్ లను క్లీన్ చేసేందుకు శానిటేషన్ కార్మికులు లేరన్నారు.
కరెంట్ బకాయిలు పేరుకుపోయి కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. జీవో నం.317తో స్థానికులను స్థానికేతరులుగా చేసి శాశ్వతంగా సొంత ఊళ్లకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, జిల్లా కార్యదర్శులు వెంకటయ్య తదితరులున్నారు.