
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు జాతీయ బోర్డు ఆఫీస్ రైతులను సంబురంలో ముంచెత్తించింది. ఆర్యానగర్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆ తర్వాత బస్వాగార్డెన్లో ఆఫీసర్స్తో నిర్వహించిన మీటింగ్లో బోర్డు లోగోను ఆవిష్కరించారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్లో సాగు చేసే పసుపునకు అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు ఉందని చెప్పి రైతుల్లో ఉత్సాహం నింపారు.
పసుపు రైతులకు లాభం కలిగించే పరిశోధనలు, పంట హార్వెస్టింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. అక్టోబర్ 3న 2023లో అసెంబ్లీ ఎలక్షన్కు ముందు ప్రధాని మోదీ ఇందూర్ సభలో పసుపు బోర్డు ప్రకటించగా.. ఈ యాడాది సంక్రాంతి నాడు కేంద్ర మంత్రి పీయూష్గోయల్ వర్చువల్గా ప్రారంభించారు. ఆఫీస్కోసం బిల్డింగ్లేకపోవడంతో ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను అలాట్ చేసింది.
బేగంపేట నుంచి హెలికాప్టర్లో మంత్రి కిషన్రెడ్డితో కలిసి వచ్చిన అమిత్షాకు ఎంపీ అర్వింద్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వెళ్లి బోర్డు ఆఫీస్ ప్రారంభించిన మంత్రి , పసుపు రకాల ప్రదర్శనను విజిట్ చేశారు. కంఠేశ్వర్ చౌరస్తాలోఎంపీ అర్వింద్ తండ్రి, మాజీ మంత్రి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్షా అవిష్కరించారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించిన సభలో ప్రసంగించి రైతుల్లో జోష్ నింపారు.
జిల్లా మంత్రికి స్వాగతం
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యాక మొదటిసారి నిజామాబాద్ వచ్చిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్వాగతం పలికారు. ఆమె వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి బస్వాగార్డెన్లో నిర్వహించిన మీటింగ్లో పాల్గొన్నారు. అమిత్షా పర్యటన సందర్భంగా నగరంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగంచెల సెక్యూరిటీ మధ్య కమాండోల రక్షణలో షా ప్రొగ్రామ్ జరిగింది.