పసుపు రైతుల సంబురం..కేంద్ర మంత్రి అమిత్షాకు ఘనస్వాగతం 

పసుపు రైతుల సంబురం..కేంద్ర మంత్రి అమిత్షాకు ఘనస్వాగతం 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ కేంద్రంగా ఆదివారం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు జాతీయ బోర్డు ఆఫీస్​ రైతులను సంబురంలో ముంచెత్తించింది. ఆర్యానగర్​లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రారంభించారు. ఆ తర్వాత బస్వాగార్డెన్​లో ఆఫీసర్స్​తో నిర్వహించిన మీటింగ్​లో బోర్డు లోగోను ఆవిష్కరించారు. నిజామాబాద్​, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్​లో సాగు చేసే పసుపునకు అంతర్జాతీయ మార్కెట్​లో గుర్తింపు ఉందని చెప్పి రైతుల్లో ఉత్సాహం నింపారు.

పసుపు రైతులకు లాభం కలిగించే పరిశోధనలు, పంట హార్వెస్టింగ్​, ప్యాకింగ్​, మార్కెటింగ్​, ఎగుమతుల విషయంలో బోర్డు ఉపయోగపడుతుందని తెలిపారు. అక్టోబర్ 3న 2023లో అసెంబ్లీ ఎలక్షన్​కు ముందు ప్రధాని మోదీ ఇందూర్​ సభలో పసుపు బోర్డు ప్రకటించగా.. ఈ యాడాది సంక్రాంతి నాడు కేంద్ర మంత్రి పీయూష్​గోయల్​ వర్చువల్​గా ప్రారంభించారు. ఆఫీస్​కోసం బిల్డింగ్​లేకపోవడంతో ఎంపీ అర్వింద్​ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రూరల్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ ను అలాట్​ చేసింది.

బేగంపేట నుంచి హెలికాప్టర్​లో మంత్రి కిషన్​రెడ్డితో కలిసి వచ్చిన అమిత్​షాకు ఎంపీ అర్వింద్​, కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, బోర్డు చైర్మన్​ పల్లెగంగారెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వెళ్లి బోర్డు ఆఫీస్ ప్రారంభించిన మంత్రి , పసుపు రకాల ప్రదర్శనను విజిట్​ చేశారు. కంఠేశ్వర్​ చౌరస్తాలోఎంపీ అర్వింద్​ తండ్రి, మాజీ మంత్రి డి.శ్రీనివాస్​ విగ్రహాన్ని అమిత్​షా అవిష్కరించారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో నిర్వహించిన సభలో ప్రసంగించి రైతుల్లో జోష్​ నింపారు. 

జిల్లా మంత్రికి స్వాగతం

జిల్లా ఇన్​చార్జ్​ మంత్రిగా నియమితులయ్యాక మొదటిసారి నిజామాబాద్​ వచ్చిన పంచాయతీరాజ్​ మంత్రి సీతక్కకు ఇందల్వాయి టోల్​గేట్​ వద్ద రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి స్వాగతం పలికారు. ఆమె వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుతో కలిసి బస్వాగార్డెన్​లో నిర్వహించిన మీటింగ్​లో పాల్గొన్నారు. అమిత్​షా పర్యటన సందర్భంగా నగరంలో భారీ పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగంచెల సెక్యూరిటీ మధ్య కమాండోల రక్షణలో షా ప్రొగ్రామ్​ జరిగింది.