ఉధంపూర్/జమ్మూ: జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్లో ఒకే రోజు రెండు బస్సుల్లో పేలుడు జరిగినట్లు జమ్మూ రీజియన్ ఏడీజీపీ ముఖేశ్ సింగ్ తెలిపారు. మొదటి పేలుడు బుధవారం రాత్రి 10.30 గంటలకు దోమాయిల్ చౌక్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న బస్సులో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆపై ఉదయం 5.30 గంటలకు ఉధంపూర్ బస్టాండ్లో నిలిపిఉన్న బస్సు పేలిపోయింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. సంఘటన ప్రాంతాలను పరిశీలించామని, దాడికి ఎక్కువ తీవ్రత ఉన్న పేలుడు పదార్థాలను వాడారని ముఖేశ్ సింగ్ తెలిపారు.
ఈ రెండు చోట్లా బాంబు దాడులు ఒకే విధంగా జరిగాయన్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరో రెండుమూడు బస్సులు దెబ్బతిన్నాయని ఉధంపూర్ రియాసి రేంజ్ డీఐజీ సులేమాన్ చౌదరి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 30న జమ్మూకాశ్మీర్లో మూడ్రోజుల పాటు పర్యటించాల్సి ఉండగా.. పేలుడు జరగడం కలకలం రేపుతోంది. అక్టోబర్1న రాజౌరీలో, 2న బారాముల్లాలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఆయన టూర్కు ముందు పేలుడు జరగడంతో అమిత్షా పర్యటనను రీషెడ్యూల్ చేశారు.