ట్విట్టర్ ఫౌండర్ జాక్​ డోర్సె కొత్త కంపెనీపై హిండెన్​బర్గ్ టార్గెట్‌

 ట్విట్టర్ ఫౌండర్ జాక్​ డోర్సె కొత్త కంపెనీపై హిండెన్​బర్గ్ టార్గెట్‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​ సంపదను 60 శాతం పడిపోయేలా చేసిన హిండెన్​బర్గ్​ మరో కంపెనీపై అలాంటి రిపోర్టునే రెడీ చేసినట్లు ప్రకటించింది. ఈసారి యూఎస్  కంపెనీ బ్లాక్​ ఇంక్‌ను టార్గెట్ చేసింది​. ఈ​ కంపెనీలో తమకు షార్ట్​ పొజిషన్లు ఉన్నట్లు కూడా హిండెన్​బర్గ్​ గురువారం వెల్లడించింది. ట్విటర్​ మాజీ ఫౌండర్​ జాక్​ డోర్సె ఈ పేమెంట్స్ కంపెనీ బ్లాక్​ ఇంక్​ను ఏర్పాటు చేశారు. యూజర్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించడంతో పాటు, కొత్త  కస్టమర్లను చేజిక్కించుకునేందుకు చేస్తున్న ఖర్చునూ అధికం చేసి ఈ కంపెనీ చెబుతోందని హిండెన్​బర్గ్​ ఆరోపిస్తోంది.

రెండేళ్ల పాటు  బ్లాక్​  ఇంక్​పై ఇన్వెస్టిగేషన్​ చేశామని, డెమొగ్రాఫిక్స్​ను తనకు అనుకూలంగా మలుచుకుని ఈ కంపెనీ లాభపడుతోందని గుర్తించామని హిండెన్​బర్గ్​ తెలిపింది. ఈ తాజా సమాచారాన్నంతటినీ తన వెబ్​సైట్​లో పెట్టింది హిండెన్​బర్గ్​. బ్లాక్​ ఇంక్ అకౌంట్లలో 40 నుంచి 75 శాతం దాకా అకౌంట్లు ఫేక్​ అకౌంట్లేనని ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు అంచనా వేసినట్లు హిండెన్​బర్గ్​ పేర్కొంది. ఇందులో మోసం జరిగిందని, అదనపు అకౌంట్లను క్రియేట్​ చేయడమో లేదా ఎక్కువ అకౌంట్లు ఒకే వ్యక్తికి చెందినవిగానో తెలుస్తోందని ఆరోపించింది.

బ్లాక్​ ఇంక్​ బిజినెస్​లో పెద్ద ఇన్నోవేషన్​ ఏమీ లేదని, కన్జూమర్లు, ప్రభుత్వాలను మోసం చేయడమేనని, చట్టాలకు చిక్కకుండా లోన్లను డ్రెస్​ అప్​ చేసిందని, దానినే రివల్యూషనరీ టెక్నాలజీగా కంపెనీ చెప్పుకుంటోందని విమర్శించింది. నెంబర్లను పెంచి చూపడం ద్వారా ఇన్వెస్టర్లను ఈ కంపెనీ మోసగించిందని  హిండెన్​బర్గ్​ పేర్కొంది. 

గత రెండేళ్లుగా రీసెర్చ్ చేసి..

బ్లాక్​ ఇంక్​పై రిపోర్టు తెచ్చేందుకు  రెండేళ్ల కాలంలో డజన్ల కొద్దీ ఆ కంపెనీ పాత ఉద్యోగులు, పార్ట్​నర్స్, ఇండస్ట్రీ ఎక్స్​పర్టులను ఇంటర్వ్యూలు చేశామని, రెగ్యులేటరీ, లిటిగేషన్​ రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా స్టడీ చేశామని హిండెన్​బర్గ్​  తెలిపింది. హిండెన్​బర్గ్​  ఆరోపణల నేపథ్యంలో బ్లాక్​ఇంక్ షేర్లు ప్రీమార్కెట్​ ట్రేడింగ్​లో 18 శాతం పతనమయ్యాయి. ఐడెంటిటీ ఫ్రాడ్స్​సహా పలు స్కామ్​లకు ఈ కంపెనీ పాల్పడిందని, వచ్చిన డబ్బును వెంటనే చేజిక్కించుకుందని ఆరోపించింది.

యూజర్లు మోసం చేసినట్లు తేలిన సందర్భాలలో వారిని బ్లాక్ ​లిస్టులో మాత్రమే పెట్టేదని, వారి అకౌంట్లను బ్యాన్​ చేసేది కాదని విమర్శించింది. ఇలాంటి అకౌంట్లను యాక్టివ్​ యూజర్ల అకౌంట్లతో అసోసియేట్​ చేసేదని, దానికి సంబంధించిన చాలా స్క్రీన్​షాట్లను ఆ  కంపెనీ మాజీ కస్టమర్ ​సర్వీస్​ ఉద్యోగి ఒకరు తమకు ఇచ్చారని హిండెన్​బర్గ్​ వెల్లడించింది. ఒక పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించిన జాక్​ డోర్సే 5 బిలియన్​ డాలర్లకు పైగా వ్యక్తిగత సంపద కూడబెట్టినట్లు ఆరోపించింది. డోర్సే, మరి కొంతమంది సీనియర్​ ఉద్యోగులూ మహమ్మారి టైములోనే బ్లాక్​ఇంక్​ కంపెనీలో బిలియన్​ డాలర్ల విలువైన షేర్లను తెగనమ్మారని తెలిపింది. తాము బాగుంటే చాలనే ఉద్దేశంతోనే వారు తమ షేర్లను అమ్మేసినట్లు పేర్కొంది.

ఓర్టెక్స్​ డేటా ప్రకారం మార్చి 22 నాటికి బ్లాక్​ ఇంక్​ ఫ్రీ ఫ్లోట్​ షేర్లలో సుమారు 5.2 శాతం దాకా షార్ట్​ పొజిషన్లు ఉన్నట్లు తేలుతోంది. ఫోరెన్సిక్​, ఫైనాన్షియల్​ రిసెర్చ్ ​సంస్థగా చెప్పుకుంటున్న హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ను 2017 లో నాథన్​ ఆండర్సన్​ నెలకొల్పారు. ఈక్విటీ, క్రెడిట్​, డెరివేటివ్స్​ ప్రొడక్టులను హిండెన్​బర్గ్​ ఎనలైజ్​ చేస్తుంది. తప్పులు చేసే కార్పొరేట్లను బయటపెట్టడమే కాకుండా, ఆ కంపెనీల షేర్లలో షార్ట్​ పొజిషన్లనూ హిండెన్​బర్గ్​ తీసుకుంటోంది.