
నర్సాపూర్(జి), వెలుగు: 325 క్వింటాళ్ల మక్కలున్న లారీ లోడును ఎత్తుకెళ్లి, అమ్మిన ఇద్దరు దొంగలను నర్సాపూర్ జి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు. కల్లూరుకు చెందిన బొద్దుల శ్రీనివాస్ అనే వ్యాపారి 325 క్వింటాళ్ల మక్కలను గత నెల ఏప్రిల్ 23న 2 లారీల్లో లోడ్ చేయించాడు. కరీంనగర్లోని ఓ ఫౌల్ట్రీ ఫామ్కు తరలించాలని డ్రైవర్లు రాజీవ్ నగర్ తాండకు చెందిన బదావత్ సంతోష్, నిజామాబాద్కు చెందిన అబ్దుల్ రజాక్ కు సూచించాడు. కానీ వారు లోడ్ను కరీంనగర్కు కాకుండా కామారెడ్డి సమీపంలోని స్నేహ చికెన్ ఫార్మ్ గోదాంలో ఓ ఏజెన్సీ ద్వారా అమ్ముకున్నారు. వచ్చిన రూ.7,48 లక్షలు, లారీలతో పరారయ్యారు.
తాను సూచించిన ఫౌల్ట్రీ ఫామ్కు లోడ్ చేరకపోవడం, డ్రైవర్లు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఇద్దరిని లారీలతోపాటు అదుపులోకి తీసుకున్నారు. చోరీ ఘటనలో మరి కొంతమంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని, పూర్తి సమాచారం సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన నిర్మల్ రూరల్ సీఐ మున్నూరు కృష్ణ, నర్సాపూర్ జి ఎస్సై సాయి కిరణ్ ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.