రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. ఆ కష్టం తమ పిల్లలకి వద్దనుకున్నారు వాళ్లు . ఉన్నంతలో పిల్లల్ని గొప్పగా చదివించాలనుకున్నారు. వాళ్లని పెద్ద ఆఫీసర్లుగా చూడాలనుకున్నారు. వాళ్ల ఆశలకి హైదరాబాద్, బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలు అండగా నిలిచాయి. దాంతో ఆ పేదింటి పిల్లలు ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ స్టేట్ ర్యాంకర్లు అయ్యారు. తల్లిదండ్రులు, చదువు చెప్పిన టీచర్ల నమ్మకాన్ని నిలబెడతామని చెప్తున్న వాళ్ల పేర్లు సాయినాథ్, ధీరజ్, రమ్య, గాయత్రి.. వాళ్ల సక్సెస్ స్టోరీ ఇది.
లక్ష్యం పెట్టుకుని చదివితే.. విజయం వెంటే నడిచొస్తుందని నిరూపించిన ఈ నలుగురిలో.. ఎంపీసీలో సాయినాథ్ 466, ధీరజ్ 465 మార్కులు తెచ్చుకున్నారు. స్టెతస్కోప్ కలతో బైపీసీలో చేరిన రమ్యకి 426, గాయత్రికి 417 మార్కులు వచ్చాయి. అయితే వీళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో అంతా పేదరికమే ఉంది. దాన్నుంచి బయటపడటానికి ముందుముందు ఇంకా కష్టపడి చదువుతామంటున్న ఈ ర్యాంకర్స్ గురించి వాళ్ల మాటల్లోనే..
అన్ని సదుపాయాలున్నాయి
మా నాన్న హరి డి.సి.ఎం నడుపుతాడు. అమ్మ ఇండ్లలో పనిచేస్తుంది. ఆ అరకొర సంపాదనతో నన్ను, ఇద్దరు అక్కల్ని చదివిస్తున్నారు అమ్మానాన్న. చాలాసార్లు ఇబ్బంది అయింది..అయినా సరే నాన్న చదువు మాన్పించలేదు. ఇంటర్మీడియెట్కి చాలా కాలేజీల్లో లక్షల్లో ఫీజులున్నాయి. అంత స్థోమత లేకపోవడంతో.. అంబేద్కర్ కాలేజీలో చేరా. ఇక్కడ తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. పైగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అందుకే బైపీసీలో 440కి 426 మార్కులు వచ్చాయి. దీనంతటికి క్రెడిట్ మా టీచర్లకే దక్కుతుంది. మా పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా.
- టి. రమ్య, అంబర్పేట్
కాలేజీ పేరు గర్వంగా చెప్తా
నాన్న మమ్మల్ని పట్టించుకోడు. దాంతో నాతో పాటు తమ్ముడి బాధ్యత అమ్మపై పడింది. మా పోషణ కోసం ఓ ప్రైవేట్ బ్యాంక్లో రోజుకి మూడొందల రూపాయలకి పనిచేస్తోంది అమ్మ. చాలీచాలని జీతంతోనే టెన్త్ వరకు ఇద్దర్నీ ప్రైవేట్ స్కూల్లో చదివించింది. అప్పోసొప్పో చేసి ఇంటర్మీడియెట్కి నన్ను ప్రైవేట్లోనే చేర్పించాలనుకుంది. కానీ, నాకది ఇష్టం లేదు. అమ్మకి నా చదువు భారం కాకూడదని, తక్కువ ఫీజున్న కాలేజీ కోసం వెతికా. అంబేద్కర్ కాలేజీలో చదువు బాగా చెప్తారని తెలిసి జాయిన్ అయ్యా. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి లెక్చరర్స్ సపోర్ట్ చేశారు. మెటీరియల్స్ అందించారు. లెక్చరర్స్ చెప్పినట్టు చదువుకోవడం వల్ల బైపీసీ లో417 మార్కులు వచ్చాయి. నేను అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్ని అని గర్వంగా చెప్పుకుంటా.
- ఎన్. గాయత్రి, బాగ్ లింగంపల్లి
పెద్ద ఇంజినీర్ అవుతా
డబ్బు లేక ఏడో తరగతితోనే చదువు ఆపేశాడు మా నాన్న రాము. ఆటో నడుపుతూ మమ్మల్ని పోషిస్తున్నాడు. చదువు విలువ తెలుసు కాబట్టి.. అన్నని, నన్ను బాగా చదివించాలనుకున్నాడు. నేను చిన్నప్పట్నించీ చదువులో ముందుండేవాడ్ని. పదో క్లాస్లో పదికి పది పాయింట్స్ తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్ చదువుకు తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజీ కోసం సెర్చ్ చేశా. చాలామంది అంబేద్కర్ కాలేజీ బాగుంటుందని చెప్పడంతో చేరా. ఫ్యాకల్టీ సపోర్ట్తో...నాకు నేను ఒక టైం టేబుల్ వేసుకున్నా. నా కష్టానికి తగ్గట్టే 470కి 466 మార్కులు వచ్చాయి. అమ్మానాన్నలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంజినీర్ అవ్వాలన్నది నా కల. దానికోసం ఇప్పట్నించే హార్డ్వర్క్ చేస్తున్నా.
–టి. సాయినాథ్, జియాగూడ
అమ్మ కష్టాలన్నీ తీర్చుతా
నాకు పదకొండేండ్లు ఉన్నప్పుడు నాన్న చని పోయాడు. అప్పట్నించి అమ్మ మంగ ఇండ్లలో పనిచేసి నన్ను, తమ్ముడ్ని చూసుకుంటోంది. నెలంతా కష్టపడితే అమ్మకి వచ్చేది 6 వేలే. వాటిల్లోనే ఇంటి కిరాయి, మా రోజువారీ అవసరాలన్నీ వెళ్లదీయాలి. అందుకే నేను ఏ రోజూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివి టెన్త్ క్లాస్లో పది పాయింట్లు తెచ్చుకున్నా. దాంతో మా స్కూల్ టీచర్ నా ఇంటర్ కాలేజీ ఫీజు కడతానంది. సాయం చేస్తున్నారు కదా అని పెద్ద కాలేజీల్లో చేరడం కరెక్ట్ అనిపించలేదు.. వీలైనంత తక్కువ ఖర్చుతో మంచిగ చదువుకోవాలని అంబేద్కర్ కాలేజీలో చేరా. ఇక్కడ టీచర్లు, మేనేజ్మెంట్ సపోర్ట్ చూశాక.. బెస్ట్ కాలేజీని ఎంచుకున్నానని అర్థమైంది. బాగా చదువుకుని అమ్మ కష్టాలన్నీ తీర్చాలనుకుంటున్నా.
- ధీరజ్, రామాంతపూర్