స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ విచారించింది. దాదాపు పదిన్నర గంటలు విచారించి 120 ప్రశ్నలు చంద్రబాబును సీఐడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల నిధుల మళ్లింపు విషయాల గురించి అడిగారని సమాచారం అందుతోంది. విచారణ నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవరులో అందజేయనున్నారు.
సీఐడీ మరో పిటిషన్
స్కిల్ స్కాం కేసు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించారు. కోర్టు ఇచ్చిన సమయం ముగియడంతో సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ వేసింది. సీఐడీ పిటిషన్ పై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం చెప్పారు. రిమాండ్ పొడిగింపుపై కూడా చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.