
- ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
- ఇంటిముందు మాట్లాడుకుంటుండగా ప్రమాదం
- బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మృతదేహాలతో ధర్నా
- పట్టించుకోని పోలీసులు.. ఫైర్ అయిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
- దళితులంటే ఎందుకంత చిన్నచూపు అంటూ మండిపాటు
జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్పూర్, వెలుగు: భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు మాట్లాడుకుంటున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు మృతదేహంతో 2 గంటల పాటు రోడ్డుపై ధర్నా చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అటువైపు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. దళితులంటే ఎందుకంత చిన్నచూపు అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో మారుపాక మధునమ్మ, నీలారపు బాలయ్య, నీలారపు మల్లయ్య, డానియల్ ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. సోమవారం మధ్యాహ్నం ఇంటి ముందు చెట్ల కింద వీరంతా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో కాళేశ్వరం నుంచి కాటారం వైపు అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఇంటి ముందు మాట్లాడుకుంటున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మారుమాక మధునమ్మ(85) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నీలారపు బాలయ్య, మల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా భూపాలపల్లి జిల్లా హాస్పిటల్కు తీసుకెళ్తుండగా నీలారపు బాలయ్య(65) మృతిచెందారు. మల్లయ్య, డానియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ తో పాటు కారులో ఉన్న నలుగురు వ్యక్తులు పరారయ్యారు.
పోలీసులపై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు మృతదేహాలతో గంట పాటు రోడ్డుపై ధర్నా చేశారు. అయినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదు. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ అక్కడ ఆగి బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి గంట అవుతున్నా పోలీసులు స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకు ఫోన్ చేసి ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు స్పాట్కు వచ్చారు..
‘‘చనిపోయిన వాళ్లు దళితులు కావడం వల్లనే మీరంతా చిన్నచూపు చూస్తున్నారా? అదే అగ్రవర్ణాల వాళ్లయితే ఇలాగే ప్రవర్తించేవాళ్లా?’’అని పోలీసులపై ఎంపీ ఫైర్ అయ్యారు. అనంతరం మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. ఆర్థిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎంపీ
సరస్వతి పుష్కరాల్లో డ్యూటీ చేస్తూ వడదెబ్బతో చనిపోయిన జీపీ ఉద్యోగి మంతెన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ హామీ ఇచ్చారు. కాటారం మండలం గంగారంకు చెందిన శ్రీనివాస్ కాళేశ్వరంలో పారిశుద్ధ పనులు చేస్తూ మృతిచెందారు. సోమవారం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అండగా ఉంటానని, ఏ సహాయం కావాలన్నా తనను అడగాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎంపీ సూచించారు.