
- ఒకరు మహారాష్ట్రకు చెందిన పదకొండేండ్ల బాలుడు.. మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి
- నిర్మల్ జిల్లా బాసర వద్ద ఘటన
నిర్మల్ (బాసర), వెలుగు : గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి.. పదకొండేండ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది వద్ద సోమవారం జరిగింది. బాసర ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని పర్భని జిల్లా టాక్లి గ్రామానికి చెందిన బాలసాహెబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బాసర సరస్వతీదేవి దర్శనానికి వచ్చారు. ముందుగా గోదావరి వద్దకు వెళ్లిన వారు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఈ క్రమంలో బాలసాహెబ్ కుమారుడు కుల్దీప్ (11) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
గమనించిన కుటుంబ సభ్యులు నదిలో గాలించగా కుల్దీప్ డెడ్బాడీ దొరికింది. అక్కడే జరిగిన మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బొల్లమల్ల రాజు (40) చనిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి బాసర వచ్చిన రాజు గోదావరిలో స్నానం చేస్తుండగా మునిగిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు నదిలో వెతకగా రాజు డెడ్బాడీ దొరికింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం డెడ్బాడీలను భైంసా ఏరియా హాస్పిటల్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.