
బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్రమోషన్స్తో గత కొన్ని నెలలుగా ఫుల్ బిజీగా ఉంది జాన్వీ కపూర్. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన ‘పరమ్ సుందరి’ ఆగస్టు నెలాఖరులో విడుదలైంది. సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ జాన్వీ చేసిన ప్రమోషన్స్కు ప్రశంసలు వచ్చాయి. అక్టోబర్ 2న వస్తున్న తన తర్వాతి చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ ప్రమోషన్స్ ఇప్పటికే షురూ చేసిన జాన్వీ కపూర్.. ఇంకోవైపు ‘హోమ్బౌండ్’ అనే చిత్రాన్ని కూడా ప్రమోట్ చేస్తోంది.
శనివారం (సెప్టెంబర్ 13) ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే వారం గ్యాప్తో జాన్వీ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. జాన్వీతో పాటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా లీడ్ రోల్స్తో తెరకెక్కిన ఈ చిత్రానికి నీరజ్ ఘైవాన్ దర్శకుడు. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు.
ఇటీవల జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు టీమ్ హాజరయ్యారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాకు ప్రాచుర్యం కల్పించింది జాన్వీకపూర్. రూరల్ ఏరియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే తమ కలను సాకారం చేసుకునే క్రమంలో ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు అనేది ఈ చిత్రం ప్రధాన కథ. నిజానికి ఇదొక ఆర్ట్ ఫిల్మ్ లాంటిది. అయినప్పటికీ కమర్షియల్ సినిమాకు తీసిపోని రీతిలో జాన్వీ దీన్ని ప్రమోట్ చేస్తోంది.