1 ఎల్టీసీలు.. 2.పండుగ ఓచర్లు
షాపింగ్ కోసమే.. క్యాష్ రాదు.. ఖర్చే పెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని అప్పులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశంలో ప్రజల వినియోగ సామర్ధ్యాన్ని పెంచేందుకు, కన్జూమర్ డిమాండ్ను పుంజుకునేలా చేయడానికి ప్రభుత్వం కొన్ని స్కీమ్లను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్లను ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ మూల ధన వ్యయాలను పెంచడం ద్వారా వ్యవస్థలో రూ. లక్ష కోట్ల కన్జూమర్ డిమాండ్ను క్రియేట్ చేయాలని చూస్తోంది. కన్జూమర్ డిమాండ్ను పెంచడం కోసం లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) క్యాష్ వోచర్ స్కీమ్, స్పెషల్ ఫెస్టివ్ అడ్వాన్స్ స్కీమ్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. కాగా, కన్జూమర్ డిమాండ్ను పెంచడమంటే ప్రజలు ఖర్చు చేసే సామర్ధ్యాన్ని పెంచడమని అర్థం. ఈ రెండు స్కీమ్ల ద్వారా రూ. 36 వేల కోట్ల కన్జూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని సీతారామన్ చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మూల ధన ఖర్చులు వలన మరో రూ. 37 వేల కోట్ల డిమాండ్ క్రియేట్ అవుతుందని అంచనా వేశారు. ‘ఎల్టీసీ ట్యాక్స్ బెనిఫిట్స్ను అందించడం వలన రూ. 28 వేల కోట్లను ప్రైవేట్ సెక్టార్ ఖర్చు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ఈ స్టిమ్యులస్ చర్యల వలన మొత్తంగా రూ. లక్ష కోట్ల కన్జూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుంది’ అని సీతారామన్ ప్రకటించారు.
ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్..
ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ను ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు 10 రోజుల లీవ్స్(పే+డీఏ) ను రియింబర్స్మెంట్గా పొందొచ్చు. అంతేకాకుండా పే స్కేల్ బట్టి ప్లయిట్, రైల్వే టికెట్ ఛార్జీలను రియింబర్స్మెంట్గా పొందడానికి వీలుంటుంది. కరోనా సంక్షోభంతో ఎల్టీసీని ఉపయోగించుకోలేక పోయిన ఉద్యోగులకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ను ఎంచుకున్న ఉద్యోగులు తమ ట్రావెల్ ఛార్జీకి మూడు రెట్ల అమౌంట్ను, లీవ్స్ను క్యాష్గా మార్చుకున్నాక, ఆ అమౌంట్ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చును కూడా 2021 మార్చి లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బులను కూడా 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ పడే ప్రొడక్ట్లను కొనడానికే వాడాలి. పేమెంట్స్ కూడా డిజిటల్ మోడ్లోనే జరగాలి. రియింబర్స్మెంట్ కావాలంటే జీఎస్టీ ఇన్వాయిస్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఉద్యోగులు ఈ స్కీమ్ను ఎంచుకుంటే ప్రభుత్వానికి రూ. 5,675 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులకే రూ. 1,900 కోట్లు ఖర్చవుతుందని సీతారామన్ చెప్పారు. 50 శాతం రాష్ట్రాలు ఈ స్కీమ్ను ఎంచుకుంటే ఎకానమీలోకి రూ. 9,000 కోట్లు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందే ట్యాక్స్ బెనిఫిట్స్ అందుతాయని సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ ఖర్చులు పెరిగితే వ్యవస్థలో రూ. 28 వేల కోట్ల కన్జూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్ ప్రయోజనాలను ప్రైవేట్ ఉద్యోగులూ పొందాలంటే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ను సవరించాల్సి ఉంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రూల్స్ను సవరించాల్సి ఉంటుందని అన్నారు.
వడ్డీ లేని అడ్వాన్స్..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి వడ్డీ లేకుండానే రూ. పది వేలను అడ్వాన్స్గా ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ అడ్వాన్స్ను పది ఇన్స్టాల్మెంట్లలో ఉద్యోగులు తీర్చాల్సి ఉంటుంది. మార్చి 31, 2021 వరకు వీరు తీసుకున్న అడ్వాన్స్లపై వడ్డీ ఉండదు. ‘ ఈ రూ. పది వేలను రూపే కార్డు ద్వారా అందిస్తారు. ఈ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. కానీ ఏదైనా కొనుగోలుకు ఖర్చు చేయొచ్చు’ అని సీతారామన్ అన్నారు. ఈ చర్య వలన వ్యవస్థలో రూ. 8 వేల కోట్ల వరకు కన్జూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెప్పారు.
కరోనా సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన ఇండియన్ రిటైలర్ ఇండస్ట్రీ, ప్రస్తుతం ఫెస్టివ్ షాపింగ్పైనే ఆశలుపెట్టుకుంది. ఆర్థిక మంత్రి ప్రకటించిన స్కీమ్లను రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) ఆహ్వానిస్తోంది. ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ వలన 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీఎస్టీ పడే ప్రొడక్ట్ల అమ్మకాలు పెరుగుతాయి. ఈ స్కీమ్ వలన కంప్యూటర్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, స్మార్ట్ఫోన్స్ వంటి ప్రొడక్ట్లకు డిమాండ్ పెరుగుతుంది.. – కుమార్ రాజగోపాలన్, ఆర్ఏఐ సీఈఓ
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఖర్చులు..
మూల ధన ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 12 వేల కోట్లను అప్పుగా ఇవ్వనున్నామని, వీటిపై 50 ఏళ్ల వరకు ఎటువంటి వడ్డీ ఉండదని సీతారామన్ చెప్పారు. దీనిలో భాగంగా నార్త్ ఈస్ట్, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రూ. 2,500 కోట్లను అప్పుగా ఇవ్వనుంది. మిగిలిన రాష్ట్రాలకు రూ. 7,500 కోట్లను అందించనుంది. ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రాల వాటాలను బట్టి ఈ డబ్బులను ఇస్తారు. మార్చి 31, 2021 లోపు రాష్ట్రాలు ఈ డబ్బులను తమ మూల ధన ఖర్చుల కింద వాడుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత నుంచి ఈ లోన్లపై వడ్డీ పడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజిలో భాగంగా ప్రకటించిన కొన్ని సంస్కరణల కోసం అదనంగా రూ. 2,000 కోట్లను రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. ‘ఇన్ఫ్రా కోసం చేసిన ఖర్చులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వాటి వల్ల ప్రస్తుతం జీడీపీ పెరగడమే కాకుండా, భవిష్యత్లో జీడీపీ పెరుగుతుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మూలధన ఖర్చులపై ఎక్కువ దృష్టి పెట్టాలి’ అని సీతారామన్ పేర్కొన్నారు. ఈ చర్యల వలన మార్చి 31, 2021 లోపు రూ. 73 వేల కోట్ల కన్జూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెప్పారు.