
- ఒకే రోజు.. ఒకే ఇంట్లో రెండు ఘటనలు
- మహబూబాబాద్ జిల్లా అవుతాపురంలో విషాదం
తొర్రూరు (పెద్దవంగర), వెలుగు: ఉరేసుకుని కోడలి సూసైడ్ చేసుకోగా.. ఆ విషయం తెలిసిన మామ గుండెపోటుతో చనిపోయిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన వేముల ఝాన్సీ(35) తొర్రూరు టౌన్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. ఆమె భర్త సంతోష్ పెద్దవంగర మండలంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఝాన్సీ ఫ్యాన్ కు ఉరేసుకుంది. W
కాగా.. భర్త స్థానికుల సాయంతో భార్యను తొర్రూరు టౌన్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్ తెలిపారు. ఈ విషయం తెలిసిన ఆమె మామ లక్ష్మయ్య(65) సాయంత్రం ఇంట్లో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఝాన్సీ మృతికి కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఝాన్సీ కి కొడుకు, కూతురు, లక్ష్మయ్య కు భార్య సరోజన ఉంది.