బోధన్ పాస్పోర్టు స్కామ్ లో ఓ ఎస్సై, ఏఎస్సైలతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. మంగళవారం మీడియాతో మాట్లాడిన సీపీ.. గత నెల బంగ్లాదేశ్కి చెందిన ముగ్గురు ప్రయాణికుల పాస్ పోర్టులు అనుమానస్పదంగా ఉన్నాయని ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారని చెప్పారు. వారిని విచారిస్తే, నకిలీ పత్రాలు ద్వారా పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు. 72 పాస్పోర్ట్లు ఇలా నకిలీ పత్రాలతో పొందారని వివరించారు. బోధన్ నుంచి దుబాయ్కి వెళ్లే ప్రయత్నం చేయగా దొరికిపోయారని చెప్పారు. మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారన్నారు.
ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్ట అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆయనే అందరికీ పాస్పోపోర్టులు ఇప్పించారని తెలిపారు. ఈ పాస్పోర్ట్ స్కామ్ లో ఎస్సై మల్లేశ్ రావు, ఏఎస్సై అనిల్ కుమార్ను అరెస్ట్ చేశామని వివరించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బోధన్లో 7 అడ్రస్ తో మొత్తం 72 పాస్పోర్ట్లు పొందారని, బోధన్ ఒకే అడ్రస్పై 37 పాస్పోర్ట్లు తీసుకున్నారని వివరించారు సీపీ సజ్జనార్.