బస్సులో తరలిస్తున్న  25.33 లక్షల నగదు సీజ్

బస్సులో తరలిస్తున్న  25.33 లక్షల నగదు సీజ్

ఆదిలాబాద్, వెలుగు: ఎలక్షన్లు దగ్గరపడుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఆదిలాబాద్​లోని ఓ ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించిన టూటౌన్​ పోలీసులు ఇద్దరి నుంచి రూ.25.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి వారి దగ్గర ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ ​చేశారు.

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డబ్బు తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సీఐ అశోక్ కుమార్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్ సాయినాథ్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్ తనిఖీలు చేశారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సజ్జనపు లక్ష్మీనారాయణ వద్ద రూ 20,80,000, కుంబారం ప్రజాపథ్ వద్ద రూ. 4.53 లక్షల నగదు సీజ్ చేశారు. ఎలక్షన్లు వస్తున్న క్రమంలో భారీగా డబ్బును తీసుకువెళ్తే సరైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.