
- ఆసియా కప్లో నేడు యూఏఈతో తొలి మ్యాచ్
- సంచలనంపై యూఏఈ గురి
- రాత్రి 8 నుంచి సోనీ నెట్వర్క్లో
దుబాయ్: దాదాపు నెల రోజుల తర్వాత ఇండియా క్రికెట్లో మళ్లీ సందడి మొదలైంది. టైటిల్ ఫేవరెట్ హోదాలో టీమిండియా ఆసియా కప్కు రెడీ అయ్యింది. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో ఆతిథ్య యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. రికార్డులు, ప్లేయర్లు, ఆట పరంగా.. ఎలా చూసినా ఈ మ్యాచ్లో ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే అత్యంత ప్రతిభావంతులైన 15 మంది నుంచి తుది జట్టును ఎంపిక చేయడమే ఇప్పుడు కత్తిమీద సాముగా మారింది.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పట్నించి బ్యాటింగ్ డెప్త్పై ఎక్కువగా దృష్టిపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎనిమిదో నంబర్ బ్యాటర్ వరకు రన్స్ వచ్చేలా ప్లాన్స్ చేస్తున్నాడు. ఇక యూఏఈతో పోరును ఈ నెల 14న పాకిస్తాన్తో జరిగే అతిపెద్ద పోరుకు డ్రెస్ రిహార్సల్గా భావిస్తుండటంతో స్థిరమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో కూడిన ఆల్రౌండర్లను బరిలోకి దించాలని యోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించాలా? లేదా పేసర్తో వెళ్లాలా? అనే సందిగ్ధత కొనసాగుతోంది.
శాంసన్ X జితేష్ శర్మ
స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టాపార్డర్లోకి వస్తుండటంతో.. టీమిండియా స్ట్రాటజీలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. సంజూ శాంసన్ స్వేచ్ఛగా ఆడే స్ట్రోక్ మేకర్ అయినా ఫైనల్ ఎలెవన్లో అతనికి ప్లేస్ దొరకడం కష్టంగా మారింది. ఓపెనర్లుగా అభిషేక్, గిల్ దాదాపుగా ఖరారయ్యారు. మూడో నంబర్ కోసం తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ రెడీగా ఉన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతన్ని కాదని శాంసన్ను ఆడించడం చాలా కష్టం. ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తిలక్ రెండో ప్లేస్లో ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. నాలుగో స్థానంలో సహజంగానే కెప్టెన్ సూర్యకుమార్ వస్తాడు. ఐదో ప్లేస్లో వికెట్ కీపర్ కమ్ ఫినిషర్గా జితేష్ శర్మకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సంజూ శాంసన్ నుంచి పోటీ ఉన్నా.. గంభీర్ మాత్రం జితేష్ వైపు మొగ్గుతున్నాడు. లోయర్ ఆర్డర్లో వేగంగా ఆడటంలో అతను దిట్ట. ఆరో స్థానం నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించే అవకాశమే లేదు. అద్భుతమైన బ్యాటర్తో పాటు ఫ్రంట్ లైన్ పేసర్గా పాండ్యా ప్లేస్ ఖాయం. బుమ్రాకు తోడుగా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలో ఒకర్ని తీసుకోనున్నారు. ఎక్స్ట్రా పేసర్ను ఆడించాలనుకుంటే ఆల్రౌండర్ శివమ్ దూబేకు చాన్స్ దక్కొచ్చు. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో ఉండనున్నారు. 8వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఇండియాకు కీలకం కానుంది.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు యూఏఈకి ఇది చాలా పెద్ద మ్యాచ్. కానుంది. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కోవడం, బ్యాటింగ్లో గిల్, సూర్యకుమార్ను ఆపడమంటే.. అసోసియేట్ నేషన్స్ క్రికెటర్ల జీవితంలో సాధారణ అంశం కాదు. కాబట్టి ఆసియా కప్లో ఇండియాను నిలువరించారంటే వాళ్ల స్థాయి మరింత పెరగనుంది. ఇండియాకు చెందిన లాల్చంద్ రాజ్పుత్ కోచింగ్లో యూఏఈ ప్లేయర్లు కూడా రాటుదేలారు. ఇటీవల జరిగన ట్రై సిరీస్లో బిగ్ హిట్టర్లుగా మారిన అలీషాన్ షరాఫ్, కెప్టెన్ మహ్మద్ వసీమ్, రాహుల్ చోప్రా, సిమ్రన్జిత్ సింగ్పై ఎక్కువ అంచనాలున్నాయి. బౌలింగ్లో జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్, హైదర్ అలీ మెరిస్తే పోటీ ఉంటుంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
యూఏఈ: ముహమ్మద్ వసీం (కెప్టెన్), అలీషాన్ షరాఫ్, రాహుల్ చోప్రా, ఆసిఫ్ ఖాన్, మహ్మద్ ఫరూఖ్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ జోహైబ్, ముహమ్మద్ జవదుల్లా / సాగీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిక్, మహ్మద్ రోహిద్.
పిచ్ / వాతావరణం
పిచ్ ఆకుపచ్చగా, కొత్తగా కనిపిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇదే పిచ్పై జరిగిన మ్యాచ్లో ఇండియా నలుగురు స్పిన్నర్లతో ఆడింది. . కాకపోతే ఇప్పుడు కాస్త పేస్ కూడా ఉండే చాన్స్ ఉంది. బుమ్రాకు తోడు మరో స్పెషలిస్ట్ పేసర్ అవసరం పడొచ్చు. ఇక, రాత్రి పూట ఉక్కపోత రెండు జట్ల ఆటగాళ్లకు కఠిన పరీక్షగా మారనుంది.
1ఇండియాతో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్లో యూఏఈ ఓడింది. 2016 ఆసియా కప్లో జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 2015 వరల్డ్ కప్లో ఓ మ్యాచ్ సహా ఇండియాతో మూడు వన్డేల్లో కూడా యూఏఈ ఓడింది.
24 గత టీ20 వరల్డ్ కప్ నుంచి టీ20ల్లో టీమిండియా గెలుపోటముల రికార్డు 24–3గా ఉంది.