
ఫారినర్స్ తో పాటు ఇండియన్స్ కు కూడా చాలా ఇష్టమైన స్పాట్ గోవా. ఒక నాలుగు రోజులు లీజర్ దొరికితే.. ఫ్యామిలీమెన్ అంతా బ్యాచ్ లర్స్ అయిపోయి.. ఫ్రెండ్స్ తో ఓ ట్రిప్ వేసుకుందాం అనిపించే హాట్ లొకేషన్ అది. ప్రస్తుతం అక్కడ ట్యాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ ఆందోళన బాట పట్టారు. ట్యాక్సీ సేవలు నిలిపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కారణం.. గోవాలోకి ఓలా, ఉబెర్ లాంటి కంపెనీల ఎంట్రీ.
యాప్ ఆధారిత టాక్సీ సేవలు అందించే ఓలా, ఉబెర్ లాంటి కంపెనీలు గోవాలోకి వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలపై లోకల్ టాక్సీ యూనియన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్య తమ జీవనోపాధిని ప్రమాదంలో పడేసేలా ఉందని ఆరోపిస్తూ,నిరసనలు చేపడతామని హెచ్చరించాయి.
ALSO READ | ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరద.. రెండు రోజుల్లో 30 మంది మృతి..
అయితే ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను సమర్ధించుకుంది. యాప్ బేస్డ్ టాక్సీల వలన టూరిస్టులు మరింతగా పెరుగుతారని, స్థానికులకు ఉపాధి మార్గాలు పెరుగుతాయని తెలిపింది. అదే విధంగా డ్రైవర్లకు లైసెన్సులు, ఇన్సురెన్సులు, ఇన్సెంటివ్స్ రూపంలో చాలా మేలు జరుగుతుందని.. అందరూ సహకరించాలని కోరింది.
ప్రభుత్వ మార్గదర్శకాలు.. డ్రైవర్లకు లాభాలు:
- లైసెన్సింగ్ ఫీజులు ఛార్జీల నిబంధనలు అమలులోకి వస్తాయి
- డ్రైవర్లకు తప్పనిసరి PSV బ్యాడ్జ్ ఉంటుంది
- అగ్రిగేటర్లు, డ్రైవర్ ఆదాయాల నుంచి ఎటువంటి కోత ఉండదు
- డ్రైవర్స్ పేమెట్లకు72 గంటల్లో పరిష్కారం
- సంవత్సరానికి 5% ఇంక్రిమెంట్లతో రూ. 10 లక్షల ఆరోగ్య బీమా
- మహిళా డ్రైవర్లకు కుటుంబ కవరేజ్తో సహా ప్రత్యేక నిబంధనలు
ఇతర ఇన్సెంటివ్స్:
20% మహిళా డ్రైవర్లు ఉన్న ట్యాక్సీ సంస్థలకు, ఏజెన్సీలకు రెన్యువల్ ఫీజులో 100% మినహాయింపు.
సంవత్సరానికి 500 ట్రిప్పులు పూర్తి చేసే మహిళలు నడిపే వాహనాలకు రూ. 30 వేల ఇన్సురెన్స్ రీయింబర్స్మెంట్.
ఛార్జీలు లేదా లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 50 లక్షల వరకు జరిమానా.
స్థానికుల ఆందోళన:
ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్, మార్గదర్శకాలపై డ్రైవర్లు సంతోషంగా ఉన్నప్పటికీ ట్యాక్సీ ఏజెన్సీలు, ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా శక్తివంతమైన యూనియన్లుగా ఉన్న టాక్సీ ఆపరేటర్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లను (ఓలా, ఉబెర్ లను) అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వలన ఇతర రాష్ట్రాల నుండి డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలివస్తారని, స్థానిక డ్రైవర్ల ఉపాధి కొల్లగొడతారని వాదిస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను ఉబర్ స్వాగతించింది. గోవాలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నమ్మకమైన, ఆధునిక మొబిలిటీ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.
అయితే గోవా యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్టేషన్ పై ప్రభుత్వ ముసాయిదా మే 20న గెజిట్లో ప్రచురించారు. జూన్ 20 వరకు సూచనలు, అభ్యంతరాలను పంపడానికి గడువు ఇచ్చింది.