హైదరాబాద్, వెలుగు: బెంగళూరుకు చెందిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) తెలంగాణలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని మాదాపూర్, కూకట్పల్లి, ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్లో బ్రాంచ్లను మొదలుపెట్టింది. మాదాపూర్ బ్రాంచ్ను తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఉత్తరాది రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా మరో 27 శాఖలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో ఇట్టిరా డేవిస్ విలేకరులతో మాట్లాడుతూ..తమకు దేశంలో 598 బ్రాంచ్లు ఉన్నాయని, 71 లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని తెలిపారు. ‘‘తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచీలను తెరుస్తాం. వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్లోకి వస్తాం. బ్యాంకు పొదుపు ఖాతాలపై 7.5 శాతం, సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై 8.75 శాతం, సాధారణ కస్టమర్లకు 8 శాతం వడ్డీ ఇస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి 25 శాతం బ్రాంచ్లను పల్లెటూళ్లలో నిర్వహిస్తున్నాం. మా డిపాజిట్ బేస్రూ.21 వేల కోట్ల వరకు ఉంది. వీటిలో రిటైల్ లోన్ల విలువ రూ.14 వేల కోట్ల వరకు ఉంది. డిజిటలైజేషన్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇటీవలే వీడియో కేవైసీ మొదలుపెట్టాం. 2022 సెప్టెంబరు నాటికి, బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 3.3 శాతం, నికర ఎన్పీఏలు 0.04 శాతం ఉన్నాయి. బ్యాంక్కు గత రెండు క్వార్టర్లలో (హెచ్1) రూ. 497 కోట్ల లాభం వచ్చింది. పోయిన ఏడాది నష్టాలు వచ్చినా ఈ ఆర్థిక సంవత్సరం మాకు ‘బెస్ట్ఇయర్’ అవుతుంది. డిసెంబర్ క్వార్టర్లో రిటైల్ డిపాజిట్లు వార్షికంగా 9 శాతం పెరిగాయి. ఎంఎస్ఎంఈలకు రూ. 10 లక్షల నుంచి రూ. 10 కోట్ల వరకు, రూ. 5 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు హోంలోన్లు ఇస్తున్నాం. త్వరలో గోల్డ్లోన్లను మొదలుపెడతాం. మరిన్ని కొత్త ప్రొడక్టులను తెస్తాం”అని వివరించారు. బ్యాంక్ ఛైర్మన్ బీఏ ప్రభాకర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.