
అది ఉక్రెయిన్లో పోల్టావా రీజియన్లోని నోవీ శాంఝరీ అనే చిన్న టౌన్. గురువారం తెల్లవారుజామున ఆ టౌన్కు ఆరు బస్సులు వస్తున్నాయి. ముందూ వెనకా సెక్యూరిటీ సిబ్బంది, భారీ కాన్వాయ్. టౌన్కు దగ్గరగా వచ్చేసరికి.. ఒక్కసారిగా ఆ బస్సులపైకి రాళ్ల వర్షం కురిసింది. బస్సుల అద్దాలు పగిలిపోయాయి. అందులోనివారు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై టైర్లు కాలుస్తూ వందలాది మంది రోడ్డును బ్లాక్ చేశారు. ‘‘మా ఊరికి తేవద్దు.. వెనక్కి తీసుకుపోండి..” అని అరుస్తున్నారు. ఓ నిరసనకారుడు ఏకంగా కారుతో పోలీసులపైకే దూసుకుపోయాడు. పోలీసులు అతికష్టం మీద కంట్రోల్ చేశారు. ఆ బస్సులను టౌన్లోని ఓ బిల్డింగ్ కు సేఫ్గా చేర్చారు. ఇంతకూ ఆ బస్సుల్లో ఉన్నది టెర్రరిస్టులో, రేపిస్టులో.. కాదు. చైనా నుంచి వచ్చిన ఉక్రెయిన్ దేశస్తులే. చైనాలో కొవిడ్ వైరస్ పుట్టిన వుహాన్ నుంచి 45 మంది ఉక్రెయిన్ పౌరులు, 27 మంది విదేశీయులను విమానంలో తీసుకొచ్చారు. వారిని నోవీలోని ఓ శానిటేషన్ సెంటర్లో14 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెట్టాల్సి ఉంది. అయితే, వారిలో కొందరు కొవిడ్ పేషెంట్లు ఉన్నారంటూ పుకార్లు వ్యాపించడంతో లోకల్ లీడర్లతో సహా జనమంతా కొట్లాటకు దిగారు. సొంత దేశస్తులను సైతం రావద్దంటూ విధ్వంసానికి దిగడం చూసి ఆ దేశ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్ స్కీ షాక్ అయ్యారు. ‘‘మనం మనుషులం. పైగా ఉక్రెయిన్ పౌరులం అన్న సంగతి మరిచిపోవడం, కనీస సానుభూతి చూపకపోవడం దారుణం” అని విచారం వ్యక్తం చేశారు.
కొవిడ్ దెబ్బకు రూ. 2 లక్షల కోట్ల నష్టం..
కొవిడ్–19 దెబ్బకు ఆసియా పసిఫిక్ రీజియన్లో అన్ని ఎయిర్ లైన్లకు కలిపి 27.8 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్లు) మేర నష్టం వస్తుందని అంచనా వేసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది మొత్తంగా ఆసియా పసిఫిక్లో ప్యాసింజర్ల సంఖ్య 13 శాతం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్కు బలైనవారి సంఖ్య 2,236కు పెరిగింది. మొత్తం 75,465 మందికి వైరస్ సోకింది. వుహాన్ లోని ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ పెంగ్ యిన్హువా (29) కూడా చనిపోయారు.
ఇండియన్లు కోలుకుంటున్నరు..
జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్లో కొవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8 మంది ఇండియన్లు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈ షిప్ లో 138 మంది ఇండియన్లు ఉండగా, మిగతా వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.