రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం ప్రభుత్వ ఆధీనంలోని 34 వేల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు.
రామచంద్రన్ ఫౌండేషన్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు తిరువనంతపురానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.అయోధ్యలోని రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయాలను కోరుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీనిని డీకే శివకుమార్ సమర్థించారు.
రాముడు,దేవాలయాలు ప్రైవేటు ప్రాపర్టీ కాదన్న డీకే శివకుమార్ .. చివరికి మనమందరం హిందువులమని, రోజూ అందరం పూజ చేస్తామని చెప్పారు. తాను రాముడు, హనుమంతుడి భక్తుడినని చెప్పారు. రాముడు అందరి హృదయాల్లోనూ ఉంటారని, ఇక్కడి నుంచే ప్రార్థించుకోవచ్చని, ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయరాదని హితవు పలికారు.
కాగా కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఈ ఇరువురూ హాజరవుతారా లేదా అనేది మాత్రం పార్టీ ఇంకా ప్రకటించలేదు.