- కమ్యూనిస్టు సర్కారు నిరంకుశ వైఖరితో భవిష్యత్ పై ఆందోళన
- జాక్మా గతే తమకూ పట్టొచ్చనే భయం
- గతేడాది సింగపూర్ లో ఏర్పాటైన ఫ్యామిలీ హౌస్లలో సగం వాళ్లవే
సింగపూర్ : చైనాకు చెందిన బిజినెస్ టైకూన్స్, అల్ట్రా రిచ్ పీపుల్ చూపు.. ఇప్పుడు సింగపూర్ వైపు ఉంది. కమ్యూనిస్టు ప్రభుత్వం కఠిన వైఖరితో విసిగివేసారిన చైనా కుబేరులు.. తమ సంపదను తరతరాల పాటు నిలిపి ఉంచే సేఫ్ ప్లేస్గా సింగపూర్ ను భావిస్తున్నారు. జాక్ మా వంటి వాళ్లనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన చైనా సర్కారు.. తమ జోలికి మాత్రం రాదని గ్యారంటీ ఏంటని అనుకుంటున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా సింగపూర్కు షిఫ్ట్ అయిపోతున్నారు. తమ వ్యాపార వ్యవహారాలకు డైరెక్షన్ ఇచ్చే, సంపదకు గార్డియన్ గా వ్యవహరించే కీలకమైన ‘ఫ్యామిలీ ఆఫీసు’లను సింగపూర్ గడ్డపై ఏర్పాటు చేసుకుంటున్నారు.
జాక్మా కంపెనీలపై సర్కారు తీరు వల్లే..
బిజినెస్ టైకూన్, అలీ బాబా గ్రూప్వ్యవస్థాపకుడు జాక్మాతో చైనా సర్కారు వ్యవహరించిన తీరు.. అక్కడి బిజినెస్ టైకూన్స్కు ఫ్యూచర్ పై భయాన్ని పెంచింది. భవిష్యత్తులో ప్రభుత్వం తమతోనూ అలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే.. కష్టపడి కూడబెట్టిన సంపదంతా ఆవిరి అవుతుందనే ఆందోళనను కలిగించింది. దీంతో చైనా బిజినెస్ టైకూన్స్ తమ సంపదకు గార్డియన్ గా నిలిచే ఫ్యామిలీ హౌస్ల ఏర్పాటుపై దృష్టిపెట్టారు. ప్రపంచంలోని పెద్దపెద్ద కార్పొరేట్కంపెనీల ఫ్యామిలీ ఆఫీసులు జపాన్, అమెరికా, ఇంగ్లండ్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నాయి. అయితే చైనా బిజినెస్ టైకూన్స్ సింగపూర్ వైపే మొగ్గు చూపారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి మారుపేరుగా ఉన్న సింగపూర్ను తమ వ్యాపారాలకు సంబంధించిన ఫ్యామిలీ హౌస్లు ఏర్పాటుకు వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఏవైనా విదేశీ వ్యాపార సంస్థలు సింగపూర్లో ఫ్యామిలీ హౌస్ ఏర్పాటు చేయాలంటే.. కనీసం రూ.15 కోట్లను అక్కడ పెట్టుబడి పెట్టాలి. ఇలా రూ.15 కోట్లు కట్టి 2022 డిసెంబరు నాటికి సింగపూర్లో 1500 కంపెనీలు ఫ్యామిలీ హౌస్ లను ఏర్పాటు చేసుకున్నాయి. కిందటేడాది అక్కడ ఏర్పాటైన ప్రతి రెండు ఫ్యామిలీ హౌస్లలో ఒకటి చైనా అల్ట్రా రిచ్ పీపుల్స్కు చెందిందే కావడం గమనార్హం. వారు తమ పిల్లలకు సింగపూర్లో పర్మినెంట్ నివాసం ఉండేలా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. చైనా బిజినెస్ టైకూన్స్ సింగపూర్కు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు.
జాక్మాకు చైనా చేసిన అన్యాయం ఏమిటి ?
ఈకామర్స్ రంగంలో వరల్డ్ ఫేమస్ ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్మా గురించి తెలియని వారుండరు. చైనా ఫిన్ టెక్ కంపెనీ యాంట్ గ్రూప్ కూడా అతడిదే. అయితే, చైనా ప్రభుత్వ సంస్థలపై జాక్మా చేసిన విమర్శలే అతది సంపదలో చాలా భాగం ఆవిరయ్యేందుకు కారణమయ్యాయి. జాక్మా విమర్శలతో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆయన వ్యాపారాలను టార్గెట్ చేసి యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూను ఆపేసింది. చైనా ప్రభుత్వం ఆదేశంతో స్టాక్ మార్కెట్లో యాంట్గ్రూప్ లిస్టింగ్పై షాంఘై, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ లు నిషేధం విధించాయి. దీంతో జాక్మా తన సంపదలో రూ.2 లక్షల కోట్లు (25 బిలియన్ డాలర్లు) నష్టపోయాడు. చైనా ప్రభుత్వం కక్షపూరిత వైఖరి నేపథ్యంలో యాంట్ గ్రూప్ ను నియంత్రించే అధికారాలను వదులుకునేందుకు జాక్మా సిద్ధమయ్యారు. కంపెనీ వాటాలను షేర్ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు ఆయన అంగీకరించారు. జాక్మా పరిస్థితే రేపు తమకు కూడా రావచ్చని చైనాలోని మిగతా బిజినెస్ టైకూన్లు జంకుతున్నారు. అందుకే వాళ్ల చూపు సింగపూర్ వైపు మళ్లింది. అక్కడ పన్నులు తక్కువగా ఉండటం, కార్మికుల సమ్మెలపై నిషేధం ఉండటం కూడా చైనా కుబేరులు సింగపూర్కు అట్రాక్ట్ అవుతున్నారు. పెడ్డుబడులు పెట్టాలనే ఆలోచనల్లో పడేస్తోంది. భవిష్యత్తుకు వ్యాపారాలకు బాటలు వేస్తోంది.
ఫ్యామిలీ హౌస్ అంటే..
ఫ్యామిలీ హౌస్ అనేది ఒక కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల పెట్టుబడులు, పన్నులు, సంపద బదిలీ, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. సంపదను సృష్టించడం, దాన్ని కంటికి రెప్పలా కాపాడటమే దీని లక్ష్యం. ఆ వ్యాపార కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులకే దీనిలోని సమాచారంపై యాక్సెస్ ఉంటుంది. వాళ్ల పర్సనల్, ఫైనాన్షియల్ సమాచారం ఇందులో భద్రంగా ఉంటుంది. మన భారతదేశంలోని చాలా కార్పొరేట్ కంపెనీలు కూడా ఈవిధంగా విదేశాల్లో ఫ్యామిలీ హౌస్లను కలిగి ఉన్నాయి.