ఇస్లామాబాద్: పర్యావరణానికి ఎక్కువ నష్టంచేసిన అభివృద్ధి చెందిన దేశాలను వదిలేసి తక్కువ నష్టం చేసిన పాకిస్తాన్ లాంటి దేశాలనే ప్రకృతి ఎక్కువ దెబ్బ కొట్టిందని యునైటెడ్ నేషన్స్(యూఎన్) చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. క్లైమేట్ చేంజ్లో పాక్ పాత్ర చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే వరదలకు తీవ్రంగా ప్రభావితమైన పాకిస్తాన్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇస్లామాబాద్లోని నేషనల్ ఫ్లడ్ రెస్పాన్స్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ను ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో కలిసి సందర్శించారు.
అనంతరం గుటెర్రెస్ మాట్లాడారు. ‘‘ప్రకృతిపై మానవాళి యుద్ధం ప్రకటించింది. దీంతో ప్రకృతి తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. కర్బన ఉద్గారాలను పాకిస్తాన్ చాలా తక్కువగా విడుదల చేస్తోంది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతోంది” అని గుటెర్రెస్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించుకోవాలని, వరదలకు అతలాకుతలమైన పాక్ను ఆదుకోవాలని సూచించారు. పాక్కు సాయం చేయడం అంతర్జాతీయ సమాజ కనీస బాధ్యత అని అన్నారు. ఇంతకుముందు కూడా పాక్కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం చేయాలని పాక్ ప్రధానితో షెహబాజ్తో కలిసి అంతర్జాతీయ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.