బాల్కొండ, వెలుగు : వేధింపులు తట్టుకోలేక ఇద్దరు భార్యలు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం దేవక్కపేటలో సోమవారం జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపేట గ్రామానికి చెందిన మాలావత్ మోహన్ (42)కు కవిత, సంగీత ఇద్దరు భార్యలు. మద్యానికి అలవాటుపడిన మోహన్ తరచూ భార్యలతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా ఇద్దరితో గొడవపడి వారిని ఓ గదిలో బంధించాడు. వేధింపులు తట్టుకోలేని కవిత, సంగీత కలిసి మోహన్ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం మోహన్ పడుకొని ఉండగా.. ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్సై సందీప్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న కవిత, సంగీత కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
