- చనిపోయిన గొర్రెల మాంసం అమ్మకం
- తనిఖీలో గుర్తించిన అధికారులు
ఏపీ విజయవాడలో మాంసం దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే చేపల మార్కెట్లోనూ తనిఖీలు నిర్వహించారు. కల్తీ మాంసం, కుళ్లిపోయిన మాంసం అంటగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య, ఆహార శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్ పెక్టర్లు మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో కుళ్లిన, చాలాకాలం నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. నిబంధనలను సైతం లెక్కచేయకుండా అనారోగ్యంతో చనిపోయిన గొర్రెల మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నట్లు తేలింది. దుర్గపురం మార్కెట్, మాచవరం, వన్ టౌన్ ఫిష్ మార్కెట్ లో ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి.
క్వాలిటీని నిర్ధారించే అధికారుల స్టాంప్ లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కుళ్లిపోయిన.. కల్తీ మాంసం అమ్మకాలను గుర్తించి సీజ్ చేశారు. దుకాణ యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేస్తామని అధికారులు తెలిపారు.