సిద్దిపేట జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఉందా లేదా .. పథకం అమలుపై స్పష్టత కరువు

సిద్దిపేట జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఉందా లేదా .. పథకం అమలుపై స్పష్టత కరువు
  • పథకం అమలుపై స్పష్టత కరువు..  ఇంకా మొదలు కాని కసరత్తు

సిద్దిపేట, వెలుగు: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై స్పష్టత కరువైంది. జూన్ రెండో వారం గడుస్తున్నా ఇంత వరకు చేప పిల్లల పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ పథకం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ ప్రారంభం నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వర్షాలు ప్రారంభం కాగానే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప, రొయ్య పిల్లలను ఉచితంగా వదిలేవారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ జరగకపోయినా జిల్లాలో అక్కడక్కడ కొంత మేర చేప పిల్లలను వదిలారు.   

గతేడాది 12.50  లక్షల చేపపిల్లల పంపిణీ

గతేడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా మొత్తం చేప పిల్లల పంపిణీ జరగలేదు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని 25 చెరువుల్లో 12.50 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. కోహెడ మండలంలోని  శనిగరం చెరువులో 8 లక్షల చేప సీడ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ వదలగా మిగిలిన 24 చెరువుల్లో 4 లక్షల సీడ్ ను వదిలారు.  జిల్లా వ్యాప్తంగా మొత్తం 1500 చెరువులు, కుంటలతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లో  చేప సీడ్ ను వదులుతున్నారు. ఏటా దాదాపు 4 కోట్ల చేప సీడ్ ను పంపిణీ చేస్తుండగా గతేడాది మాత్రం ఎన్నికల కోడ్ నేపథ్యంలో అతి తక్కువగా వదిలారు.  జిల్లాలో  357 మత్స్యకార సొసైటీల్లో 25,018 మంది సభ్యులున్నారు. 

ప్రారంభం కాని కసరత్తు

ఈ ఏడాది ఉచితంగా చేప, రొయ్య విత్తనాలను పంపిణీ  కసరత్తు ప్రారంభం కాలేదు. గతంలో ఏప్రిల్​, మే నెలల్లోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి జులై నుంచి సెప్టెంబరు వరకు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలేవారు. పెద్ద చెరువుల్లో రవ్వులు, బొచ్చ రకాలు, చిన్న చెరువులు, కుంటల్లో రవ్వులు, బొచ్చ, బంగారు తీగ రకం సీడ్ ను వదిలిపెట్టేవారు. వీటిలో పెద్ద రకం 80 నుంచి 100 ఎంఎం, చిన్న రకం 35 నుంచి 40 ఎంఎం సీడ్ ను ఆయా చెరువులు కుంటల్లో వదిలేవారు.

 ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చేప పిల్లల పంపిణీ  పథకానికి  బ్రేక్ పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి మత్స్య శాఖ కేటాయించడంతో చేప సీడ్ పంపిణీకి అడుగులు పడతాయని మత్స్య కారులు భావిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు మత్స్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

 అనాసక్తికి అవకతవకలే కారణం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తక్కువ మొత్తంలో పంపిణీ చేసి ఎక్కువ మొత్తానికి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చినా ఎలాంటి విచారణ జరపలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రచారం సాగుతోంది.

ప్రభుత్వం నుంచి ఎలాంటీ ఆదేశాలు రాలేదు

ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటీ ఆదేశాలు రాలేదు. చేప సీడ్ పంపిణీ జరుగుతుందా లేదా అనే విషయం మా పరిధిలో లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఇందుకు సంబంధించిన ప్రణాళికతో ముందుకు వెళ్తాం. గతంలో జిల్లాలో దాదాపు 1500 జలాశయాల్లో చేప విత్తనాలను పంపిణీ చేశాం. 

మల్లేశం, జిల్లా మత్స్య శాఖ అధికారి