- హైదరాబాద్ మిల్లెట్స్ మెగా కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి తోమర్
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు పౌష్టికాహారం అందజేసేందుకు మిల్లెట్ మిషన్ చేపట్టామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు నిర్వహించే మిల్లెట్స్ మెగా కన్వెన్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే మిల్లెట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో మిల్లెట్స్కు ప్రాధాన్యం ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధాని మోడీ చొరవతతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్గా ప్రకటించిందన్నారు. చిన్న కమతాలున్న రైతులను సంఘటితం చేసేందుకు రూ.6,850 కోట్లు ఖర్చు చేసి కొత్తగా10 వేల ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనేజేషన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అగ్రిఇన్ఫ్రాను అభివృద్ధి చేస్తం
వ్యవసాయ రంగంలో ఉన్న లోటుపాట్ల పరిష్కారం, మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పాడి పరిశ్రమకు రూ.15 వేల కోట్లు, ఫిషరీష్కు రూ.20 వేల కోట్లు, ఔషధ మొక్కల కోసం రూ.4 వేల కోట్లు, రూ. 10 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్, రూ.5 వేల కోట్లు తేనెటీగల పెంపకానికి కేటాయించామని వివరించారు.