బడ్జెట్లో రాష్ట్రానికి రూ. 36 వేల కోట్లు

బడ్జెట్లో రాష్ట్రానికి రూ. 36 వేల కోట్లు
  • పన్నుల వాటా, ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లతో సరి
  • తెలంగాణ, ఏపీలోని ట్రైబల్​ యూనివర్సిటీలకు రూ. 40 కోట్లు
  • మెట్రో సిటీ హైదరాబాద్​కు ప్రత్యేకంగా రూ. 245  కోట్లు

‌‌‌‌‌‌‌‌‌‌హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్​లో కొత్త వరాలు, కొత్త నిధులేమీ లేకపోవడం ఈసారి 
తెలంగాణను నిరుత్సాహపరిచింది. చట్ట ప్రకారం రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాతో పాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు మాత్రమే రాష్ట్రానికి రానున్నాయి. బడ్జెట్​ లెక్కల ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి దాదాపు రూ. 36 వేల కోట్లు విడుదలవనున్నాయి. నిరుటితో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో చెప్పుకోదగ్గ మార్పు లేదు.  మిషన్​ భగీరథకు రూ. 2,350 కోట్ల ఆర్థిక సాయం అందించాలని ఫైనాన్స్​ కమిషన్​ చేసిన సిఫారసుకు ఈ బడ్జెట్​లో కూడా చోటు దక్కలేదు. నీతి అయోగ్​ సిఫారసు మేరకు ఈ స్కీమ్​కు భారీగా నిధులు ఇవ్వాలని నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి  రూ. 52 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో భారీ  అంచనాలు వేసుకుంది. ఆర్థిక సంవత్సరానికి  మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో  కేంద్రం ఇచ్చే  నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు వదులుకుంది. తెలంగాణ, ఏపీలోని ట్రైబల్​ యూనివర్సిటీలకు రూ. 40 కోట్లు  కేటాయించటం తప్ప బడ్జెట్​లో రాష్ట్రానికి  ప్రత్యేక వరాలు, నిధులేమీ కేటాయించలేదు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పెండింగ్​లో పెట్టింది.  కాళేశ్వరం ప్రాజెక్టు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట వ్యాగన్‌‌  కోచ్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలకు బడ్జెట్​లో  చోటు దక్కలేదు. 
పన్నుల వాటా, జీఎస్టీ పరిహారంతో ఊరట
ప్రతి ఏడాది కేంద్రం నుంచి  పన్నుల వాటాతో (టాక్స్​ డెవల్యూషన్)​ పాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​ల నిధులు రాష్ట్రాలకు విడుదలవుతాయి. సెంట్రల్​ జీఎస్టీ, ఇన్​కమ్​ ట్యాక్స్,  సీజీఎస్టీ, కస్టమ్స్  ట్యాక్స్​, ఎక్సైజ్​ డ్యూటీ, సర్వీస్​ టాక్స్, కార్పొరేట్​ ట్యాక్స్​ల ద్వారా కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఫైనాన్స్​ కమిషన్​ నిర్ణయించిన వాటా ప్రకారం అందులో 2.1 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. ఈ బడ్జెట్ ప్రకారం పన్నుల వాటా కింద రూ. 17,165 కోట్లు వస్తాయి. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పరిహారం కింద రూ. 2,379  కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ఇప్పటికే సూచించింది. వీటికి తోడు కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్​ స్పాన్సర్డ్  స్కీమ్​ నిధులు ఈసారి దాదాపు  రూ. 11,800 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల  గ్రాంట్లు, హెల్త్ గ్రాంట్​, అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్​ గ్రాంట్​, స్టేట్​ స్పెసిఫిక్​ గ్రాంట్లతో పాటు జీఎస్టీ పరిహారం .. అన్నీ కలిపితే నిరుటి కంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెయ్యి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లు మాత్రమే పెరిగే అవకాశముంది. ఈ ఏడాది హెల్త్ గ్రాంట్​ కింద రూ.419 కోట్లు, స్టేట్ పర్​ఫార్మన్స్​ ఆధారంగా ఇచ్చే​ స్పెసిఫిక్​ గ్రాంట్​ కింద రూ. 472 కోట్లు,  అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్​ ఇన్సెంటివ్​ కింద రూ. 1,665 కోట్లు రాష్ట్రానికి విడుదలవుతాయి. 
హైదరాబాద్​కు గ్రాంట్​
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 2,112 కోట్ల గ్రాంట్​ రిలీజవనుంది. మెట్రో సిటీ హైదరాబాద్​కు ప్రత్యేకంగా రూ. 245  కోట్లు, విపత్తుల నిర్వహణ సాయానికి  రూ. 629 కోట్లు కేటాయించారు. గ్రామీణ్​ సడక్​ యోజనతో పాటు జ్యుడీషియరీ​ గ్రాంట్ల కింద  మరో రూ. 96  కోట్లు విడుదలవుతాయి.