వెలుగు, బిజినెస్డెస్క్: బడ్జెట్ కాలవ్యవధి ఏటా ఏప్రిల్ 1న ప్రారంభమై తదుపరి సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చులు, ఆదాయాలను వివరించే వార్షిక ఆర్థిక నివేదిక ఇది. దీనిని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలను వివరించే సమగ్ర పత్రంగా ఈ డాక్యుమెంటును పేర్కొనవచ్చు. సర్కారు బాధ్యతలతో పాటు, అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటిస్తుంది. వీటికి భారీ ఎత్తున డబ్బు అవసరం. ఇంతకీ ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? ప్రధానంగా ఆదాయాలు, అప్పుల ద్వారా డబ్బు సమకూరుతుంది. కేంద్ర బడ్జెట్ పత్రం 2023–-24లో పేర్కొన్న విధంగా ఖర్చు కోసం ప్రభుత్వానికి డబ్బు ఎలా వచ్చిందో చూద్దాం. ప్రధానంగా వాటాను లోన్లు, లయబిలిటీల (డివిడెండ్, వడ్డీల వంటివి) నుంచి బడ్జెట్కు నిధులు అందుతాయి. ఈ రెండింటి వాటా 34 శాతం ఉంటుంది. జీఎస్టీ ద్వారా 17 శాతం, ఆదాయపు పన్నులు, కార్పొరేషన్ పన్నుల నుంచి 15 శాతం చొప్పున డబ్బు వస్తుంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు, నాన్-టాక్స్ రాబడి వరుసగా 7 శాతం, 6 శాతం ఆదాయాన్ని ఇస్తాయి.
డబ్బు ఎక్కడికి వెళ్తుంది ?
ప్రభుత్వం తన బడ్జెట్లో 20 శాతం వడ్డీ చెల్లింపులకు కేటాయిస్తుంది. పన్నులు, సుంకాలలో తన వాటా చెల్లిస్తుంది. కేంద్ర రంగ పథకానికి నిధులు సమకూర్చుతుంది. పన్నులకు 18 శాతం, సుంకాలకు 17 శాతం నిధులు వెళ్తాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 9 శాతం, రక్షణశాఖకు 8 శాతం నిధులు కేటాయిస్తారు. రాష్ట్రాలకు 9 శాతం వరకు నిధులను బదిలీ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ ఆర్థికరంగానికి కీలకం కాబట్టి వ్యాపారాలు, పెట్టుబడిదారులతోపాటు సాధారణ ప్రజలు నిశితంగా గమనిస్తారు.