- లోపాలను సరిదిద్దండి
- పీఎస్బీలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు తమ బంగారు లోన్ల పోర్ట్ఫోలియోను సమీక్షించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని సందర్భాలు తమదృష్టికి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గోల్డ్ లోన్ల విధానాలను పరిశీలించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోరింది.
గోల్డ్ లోన్ వ్యాపారంపై సమగ్ర సమీక్ష చేపట్టాలని బ్యాంకులను కోరామని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఫీజులు, వడ్డీ వసూలు, గోల్డ్ లోన్ ఖాతాల మూసివేతకు సంబంధించిన లోపాలను పరిష్కరించాలని సూచించారు. తగినంత బంగారం లేకుండా బంగారు లోన్లు ఇవ్వడం, ఫీజుల వసూళ్లు, నగదు రూపంలో తిరిగి చెల్లించడంలో అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది.
బ్యాంకుల నియంత్రణ అవసరాలు, విధానాలకు అనుగుణంగా అన్ని బంగారు రుణాలు పంపిణీ అయ్యాయో లేదో నిర్ధారించుకోవడానికి జనవరి 1, 2022 నుంచి జనవరి 31, 2024 వరకు ఇచ్చిన లోన్లను పరిశీలించాలని స్పష్టం చేసింది. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.63,365 నుంచి రూ.67,605కి ఎగబాకింది. దేశంలో అతిపెద్ద లెండర్ ఎస్బీఐకి డిసెంబర్ 2023 నాటికి రూ. 30,881 కోట్ల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు నగల విలువలో 75 శాతం మొత్తాన్ని మాత్రమే లోన్గా ఇవ్వాలి. కరోనా సమయంలో ఈ పరిమితిని 90 శాతానికి పెంచారు.