న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పొదుపు బాట పట్టింది. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు తమ ఖర్చుల్లో 20 శాతం మేర తగ్గించుకోవాలని ఫైనాన్స్ మినిస్ట్రీ సూచించింది. ఏ విభాగాల్లో ఖర్చులు తగ్గించుకోవచ్చో చెబుతూ ఓ లిస్ట్ను విడుదల చేసింది. ఓవర్టైమ్ అలవెన్స్లను ఇవ్వడం, డొమెస్టిక్, విదేశీప్రయాణాలు, రాయల్టీ, రెంట్లు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఆఫీస్లోని స్టేషనరీ వంటి వాటిపై పెట్టే ఖర్చు వంటి 18 విభాగాల్లో ఖర్చులు తగ్గించుకోవాలని సలహాయిచ్చింది. కానీ, కరోనాకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చులపై ఎటువంటి లిమిట్ను ఫైనాన్స్ మినిస్ట్రీ పెట్టలేదు. 2019–20 ఆర్థికసంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవాలని ప్రకటించింది. కరోనాకు ముందు ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడంతో మినిస్ట్రీలు,డిపార్ట్మెంట్లు తగ్గించే ఖర్చు పెద్దగా ఉండకపోవచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కరోనా వలన కిందటి ఆర్థిక సంవత్సరంలో మంత్రిత్వ శాఖలు,డిపార్ట్మెంట్లు చేసే ఖర్చులు తక్కువగా ఉన్నాయి కాని 2019–20 లో ఖర్చులు సాధారణంగా జరిగాయని గుర్తు చేస్తున్నారు. బేస్ ఇయర్ అంటే ఆఏడాదిలో చేసిన ఖర్చులను ప్రామాణికంగా తీసుకుంటారు.
పెరిగిన సంక్షేమ భారం..
అన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫీస్ ఆఫ్ మెమరండంను ఇష్యూ చేసింది. ‘అనవసర ఖర్చులు, ఖర్చుచేయకపోయినా ఫర్వాలేదనిపించేవి తగ్గించుకోవాలి. ఖర్చుల్లో 20 శాతాన్ని తగ్గించుకోవడాన్ని టార్గెట్గా పెట్టుకోవాలి’ అని ఈ ఇష్యూలో ఉంది.ఎటువంటి స్కీమ్లకు సంబంధించని ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా కట్టడిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు పెరగడం, ఇతర సంక్షేమ పథకాలపై చేస్తున్న ఖర్చులు పెరగడంతో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. కాగా, ఈ నెల 21 నుంచి దేశంలోని 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ సేకరణ కోసం రూ. 35 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ముందు ప్లాన్స్ వేసుకోగా, కొత్త వ్యాక్సినేషన్ పాలసీతో ఈ ఖర్చు రూ. 50 వేల కోట్లకు పెరిగింది. దీంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫ్రీ ఫుడ్ రేషన్ ప్రోగ్రామ్ను ఈ ఏడాది నవంబర్ వరకు ప్రభుత్వం పొడిగించింది. దీనికి రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కూడా ప్రభుత్వం పెంచింది. 2020–21 లో ఈ సబ్సిడీ రూ.79,530 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 94,305 కోట్లకు పెరిగింది. ఇలా సంక్షేమాలపై ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. మరోవైపు దేశ
ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి పరిమితం చేయాలంటే ఖర్చులు తగ్గించుకోక తప్పదని నిపుణలు చెబుతున్నారు.
వీరిపై ప్రభావం..
వివిధ లెవెల్స్లో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఓవర్టైమ్ అలవెన్స్లను కట్ చేసింది. దీంతో డ్రైవర్, ప్యూన్ వంటి క్లాస్ సీ కి చెందిన ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రావెల్ను సీనియర్ ఉద్యోగులు ఇక తగ్గించాల్సిఉంటుంది. ప్రభుత్వం వర్క్ కోసం తీసుకునే రెంట్ ప్లేస్లు తగ్గుతాయి. ఆఫీస్ ఖర్చుల్లో 20 శాతాన్ని తగ్గించాలని ఫైనాన్స్ మినిస్ట్రీ ఆదేశించడంతోఆఫీస్ల్లో స్టేషనరీ ప్రొడక్ట్లు, పవర్ బిల్లులు తగ్గుముఖం పడతాయి. వీటిలో ఖర్చులు తగ్గించుకోవాలి..
ఓవర్ టైమ్ అలవెన్స్లు, రివార్డ్లు, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఖర్చులు, ఆఫీస్ ఖర్చులు, రెంట్లు, రేట్లు, రాయల్టీ, పబ్లికేషన్స్, ఇతర అడ్మినిస్ట్రేషన్ఖర్చులు, సప్లయ్ అండ్ మెటీరియల్స్పై అయ్యే ఖర్చులు, రేషన్ ఖర్చులు, చిన్న చిన్న పనులు, మెయింటెనెన్స్, అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిసిటీ,గ్రాంట్లు, పెట్రోల్ వంటి వాటి కోసం చేసే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాయించ్చింది.
క్యాపెక్స్ను మాత్రం పెంచండి..
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని చెబుతూనే, మినిస్ట్రీలు తమ ఇన్ఫ్రా ఖర్చులను పెంచాలని ఫైనాన్స్ మినిస్ట్రీ కోరుతోంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చేసే కేటాయింపులు పెంచాలని వివిధ మినిస్ట్రీలను, ప్రభుత్వ కంపెనీలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడాలంటే కంపెనీల క్యాపెక్స్ను పెంచాలని అన్నారు. ఎంఎస్ఎంఈల బకాయిలను త్వరగా క్లియర్ చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలు, వీటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్లకు( సీపీఎస్) సూచించారు. క్యాపెక్స్ను మరింత పెంచాలని, ముందుగా పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువ సాధించాలనే ఉద్దేశంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఇన్ఫ్రా సెక్టార్ కోసం తయారు చేసిన రోడ్మ్యాప్పై నిర్మలా సీతారామన్, ఇతర అధికారులతో చర్చించారు. అమలు సాధ్యమయ్యే ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానాల కోసం వెతకాలన్నారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశానికి పలుశాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. మంత్రిత్వ శాఖలు, వాటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ల క్యాపెక్స్ ప్లాన్లను, బడ్జెట్ ప్రకటనల అమలును, ఇన్ఫ్రా పెట్టుబడులను వేగవంతం చేయడంపై ఈ మీటింగులో చర్చించారు.