
పాట్నా: బిహార్లో ఇండియా కూటమి గనక అధికారంలోకి వస్తే రాష్ట్రం చొరబాటుదారులతో నిండిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. గురువారం బిహార్లోని డెహరీ ఆన్సోన్లో పార్టీ కార్యకర్తలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించేందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఇటీవల ఓటర్ అధికార్యాత్ర నిర్వహించారని అన్నారు.
దేశంలో ఓట్ల చోరీ జరిగిందంటూ ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని గతంలోనూ దుష్ప్రచారం చేశారని విమర్శించారు. మన ఉద్యోగాలు, పక్కా ఇండ్లు, ఉచిత వైద్యాన్ని చొరబాటుదారులకు ఇవ్వాలని రాహుల్గాంధీ, ఆయన బృందం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.