10 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం
గత 9 ఏళ్లలో 10 వేల దాడులు
3,749 మంది మృత్యువాత
దాడులు, మరణాల్లో చత్తీస్గఢ్ టాప్
న్యూఢిల్లీ: మన రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం చాలా వరకు తగ్గిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. తొమ్మిదేళ్లలో 10 రాష్ట్రాల్లో 10,660 మావోయిస్టు దాడులు జరిగాయని.. ఇందులో ఏపీ, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో కలిపి 4 శాతమే జరిగినట్లు తెలిపింది. 10 రాష్ట్రాల్లో 9 ఏళ్లలో జరిగిన దాడుల్లో 3,749 మంది మృతి చెందారని చెప్పింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజంలో సీపీఐ (మావోయిస్టు) బలంగా పని చేస్తోందని, మొత్తం దాడుల్లో 88 శాతం దీనివేనని చెప్పింది. ఈ మేరకు 2018–19కి గాను రిపోర్టును విడుదల చేసింది. చత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. దాడులు, మృతుల సంఖ్యలో చత్తీస్గఢ్, జార్ఖండ్ టాప్లో ఉన్నాయని.. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తంగా 71.7 శాతం దాడులు జరిగాయని, 81.7 శాతం మంది మృతి చెందారని వివరించింది. చత్తీస్గఢ్లో జరిగిన 3,769 దాడుల్లో 1,370 మంది మృతి చెందారని, జార్ఖండ్లో 3,358 దాడులు జరగ్గా 997 మంది చనిపోయారని తెలిపింది.
దాడులు తగ్గినయ్
పది రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో దాడులు 26.7 శాతం తగ్గాయని.. 2013లో 1,136 జరిగితే 2018లో ఈ సంఖ్య 833కు తగ్గిందని హోం శాఖ వెల్లడించింది. దాడుల్లో మృతి చెందిన వాళ్ల సంఖ్య కూడా 39.5 శాతం తగ్గిందని, 2013లో 397 మంది చనిపోతే 2018లో 240 మంది మృతి చెందారని వివరించింది. సెక్యూరిటీ ఫోర్సుల మరణాలూ 10.7 శాతం తగ్గాయని.. 2013లో 75 మంది చనిపోతే 2018లో 67కు తగ్గిందని చెప్పింది. ఎల్డబ్ల్యూఈ క్యాడర్ మరణాలు 65.4 శాతం పెరిగాయని.. 2013లో 136 మంది మృతి చెందితే 2018లో 225కు పెరిగిందని వివరించింది. కేంద్రం యాక్షన్ ప్లాన్ వల్ల ఎల్డబ్ల్యూఈ పరిధి కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. 2013లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు జరిగితే 2018లో 60 జిల్లాల్లోని 251 స్టేషన్లలో దాడులు జరిగాయంది.
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు | 10 |
తొమ్మిదేళ్లలో జరిగిన దాడులు | 10,660 |
మృతి చెందిన వారు | 3,749 |
ప్రభావం ఎక్కువున్న రాష్ట్రాలు | చత్తీస్గఢ్,
జార్ఖండ్ |
ఎక్కువ దాడులు చేసింది | సీపీఐ
(మావోయిస్టు) |