తాండూర్, వెలుగు: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడంలో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి అభినందనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని జింగుర్తి వద్ద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సాందీపని గురుకులం’ కొత్త భవన ప్రారంభోత్సవం, వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళారంగాల్లోనూ రాణించాలని, ఆ దిశగా ఫౌండేషన్ ప్రోత్సహించడం శుభపరిణామమని అన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, స్కూల్ చైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
