
హుజూరాబాద్ బైపోల్లో ఈటల రాజేందర్ను ఓడించడానికి టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వేల కోట్ల ప్రభుత్వ నిధులను టీఆర్ఎస్ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి దుర్వినియోగాన్ని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారికి టీఆర్ఎస్లో కనీస గుర్తింపు కూడా దక్కడం లేదన్నారు.
‘ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ వేల కోట్ల ప్రభుత్వ నిధులు, పార్టీ నుంచి వందల కోట్లను ఖర్చు పెడుతోంది. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్తో కలలో కూడా లోపాయకార ఒప్పందం అనేది జరగదు. ఇలాంటి ఒప్పందాలు టీఆర్ఎస్ పార్టీకే సొంతం. మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకున్న చరిత్ర టీఆర్ఎస్ది. గ్యాస్ ధరల పెంపు కేంద్ర, -రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండదు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరల హెచ్చు, తగ్గులను బట్టి గ్యాస్ ధరలు పెరుగుతాయి. ప్రజలపై భారం పడకుండా ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది’ అని కిషన్ రెడ్డి చెప్పారు.