- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికిలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రెసిడెంట్, ప్రధానిసహా సగం ప్రభుత్వం ట్విట్టర్లో ఉందని, కేంద్రం ఎంత న్యాయంగా ఉందో ఈ విషయమే చెబుతోందన్నారు. సోషల్ మీడియా సంస్థలు లోకల్ రూల్స్ను పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. రూల్స్ పాటించకపోవడం వల్లే ట్విట్టర్ ఇంటర్ మీడియరీ హోదా కోల్పోయిందన్నారు. ‘వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై దాడి చేసినప్పుడు.. అప్పటి అధ్యక్షుడితో సహా అందరి ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేస్తారు. కానీ రైతుల స్ట్రైక్ టైమ్లో ఎర్రకోటపై టెర్రరిస్టుల సపోర్టర్లు కత్తులు చూపుతూ, పోలీసులను గాయపరిస్తే.. అది భావ ప్రకటనా స్వేచ్ఛనా? లడఖ్ను చైనాలో భాగంగా చూపిస్తారు. దాన్ని తొలగించాలని మిమ్మల్ని అడిగేందుకు మాకు 15 రోజులు పడుతుంది. ఇది న్యాయం కాదు. ప్రజాస్వామ్యంలో ఇండియా తన డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సమాన అర్హత కలిగి ఉంది’ అని స్పష్టంచేశారు. ఐటీ రూల్స్కు వ్యతిరేకంగా లీగల్గా వెళ్తున్న వాట్సాప్ గురించి స్పందిస్తూ.. సాధారణ పౌరులంతా వాట్సాప్ వాడకం కొనసాగించవచ్చని తెలిపారు.