కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుంది. గంటగంటకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా ఇటలీ, చైనాలను దాటేసింది. ఇప్పటి వరకు 104,205 కేసులతో టాప్ ప్లేసులో ఉంది. ఆ తర్వాత 86,498కేసులో ద్వితీయ స్థానంలో ఇటలీ. ఆ తర్వాతి స్థానాల్లో చైనా 81,394, స్పెయిన్ 65,719, జెర్మనీ 50,871 కేసులతో ఉన్నాయి.
ఇక కరోనా మరణాల కేసులో ఇటలీ 9,134 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది మృతి చెందారు. ఇక ఇటలీ తర్వాత స్పెయిన్ లో 5,138 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా 3295, ఇరాన్ 2378 , ఫ్రాన్స్ 1995, అమెరికా 1701 మరణాలతో ఉన్నాయి. ఇండియాలో 887 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 20 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలకు(5,97,267 కేసులు) చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సర్కారు జాగ్రత్త పడలే..
కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్టు, అమెరికాలో కేసులు పెరగడానికీ ఎన్నో కారణాలున్నాయి. కేసులు పెరుగుతున్నా సర్కార్ ముందే పట్టించుకోలేదు. లాక్డౌన్లు ప్రకటించినా జనాలు వినిపించుకోలేదు. కరోనా కేసులు పెరుగుతున్నా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏమీ కాదంటూ మాటలు చెప్పుకొచ్చారు. కనీస చర్యలు తీసుకోలేదు. కేసులు పెరిగాక కూడా లాక్డౌన్ అవసరం లేదంటూ పట్టుబట్టారు.
కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలియగానే చైనా ప్రెసిడెంట్ షి జిన్పింగ్ వెనువెంటనే వుహాన్లో ఓ తాత్కాలిక ఆస్పత్రిని కట్టించారు. జస్ట్ వారం రోజుల్లో అది అందుబాటులోకి వచ్చింది. కరోనా లక్షణాలున్న వారందరినీ ఆస్పత్రుల్లో చేర్పించారు. బలవంతంగా లాక్కెళ్లి హాస్పిటళ్లలో పడేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించారు. ఏ ఒక్కరినీ బయటకు రానివ్వలేదు. కానీ, అమెరికాలో ఆ పరిస్థితి లేదు. స్పెషల్గా ఓ ఆస్పత్రి కట్టింది లేదు.. లాక్డౌన్ ప్రకటించింది లేదు. టెస్టులు ఎక్కువగా చేసిందీ లేదు. కేసులు పెరిగిపోగానే న్యూయార్క్ సహా కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటించాయి. కానీ, జనమెవరూ మాట విన్లేదు. ఎక్కడపడితే అక్కడ గుమిగూడారు. బీచుల్లో తిరిగారు. బార్లలో తాగారు. పబ్బుల్లో చిందులేశారు. ఇటలీ జనం చేసిన తప్పులనే వాళ్లూ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అందువల్లే ఇప్పుడు కేసుల్లో అమెరికా టాప్లో ఉంది. దీనికి కారణం ట్రంపేనని నిపుణులు మండిపడుతున్నారు.